
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ తండ్రయ్యాడు. అతని సతీమణి తాన్య వధ్వా బుధవారం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. మహిళా దినోత్సవం(మార్చి 8) రోజే ఆడ బిడ్డ పుట్టడంపై ఉమేశ్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక ఉమేశ్ యాదవ్కు అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. మహిళా దినోత్సవం రోజు ఉమేశ్ ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవలే ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్(74) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్కు చెందిన తిలక్ ఉద్యోగ రీత్యా మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్థిరపడ్డారు. వాల్నీ కోల్ మైన్లో పని చేసి రిటైర్ అయ్యారు. రెజ్లింగ్ పట్ల ఆయనకు అమితాస్తి. ఇక కొడుకును పోలీస్గా చూడాలని తిలక్ యాదవ్ భావించారు. అందుకు తగ్గట్లుగా ఉమేశ్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో క్రికెటర్ అవుతానని తండ్రిని ఒప్పించిన ఉమేశ్ యాదవ్.. టీమిండియా పేసర్గా ఎదిగాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఉమేశ్ యాదవ్.. ఇంకా తన కూతుర్ని చూడలేదు. తొలి రెండు టెస్ట్ల్లో బెంచ్కే పరిమితమైన అతను మూడో టెస్ట్లో షమీకి రెస్ట్ ఇవ్వడంతో జట్టులోకి వచ్చాడు. ఈ అవకాశాన్ని ఉమేశ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ మూడు వికెట్లు తీసిన అతను బ్యాటింగ్లో మెరుపులు మెరిపించాడు. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే చివరి టెస్ట్లోనూ అతను ఆడనున్నాడు. మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చినా.. ఉమేశ్ స్థానానికి డోకా లేదు. మహమ్మద్ సిరాజ్కు రెస్ట్ ఇవ్వనున్నారు.
పంజాబ్కు చెందిన తాన్యాను ఉమేశ్ యాదవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2021 జనవరి 2న ఆడ బిడ్డకు జన్మనించిన ఈ జంట.. ఇప్పుడు రెండో సంతనంగా కూడా కూతురికే జన్మనిచ్చింది.