పోచెఫ్స్ట్రూమ్(దక్షిణాఫ్రికా) : అండర్-19 ప్రపంచకప్లో నయా చాంపియన్ అవతరించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్పై డక్వర్త లూయిస్ ప్రకారం 3 వికెట్లతో నెగ్గిన బంగ్లాదేశ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.
బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా చెలరేగిన ఆ జట్టు ఎట్టకేలకు ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ భారత్ తుది సమరంలో మాత్రం ఒత్తిడికి చిత్తయింది. బ్యాటింగ్, బౌలింగ్లో మూకుమ్మడిగా విఫలమై రన్నరప్తో సరిపెట్టుకుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యువ భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. తన ఫామ్ను కొనసాగిస్తూ ఓపెనర్ యశస్వి జైస్వాల్(88) మరో హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాట్స్మన్ దారుణంగా విఫలమయ్యారు.
తిలక్ వర్మ(38), ప్రియమ్ గార్గ్(22) మినహా మిగతా బ్యాట్స్మన్ సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్(3/40), షోరిఫుల్ ఇస్లామ్(2/31), తజీమ్ హసన్ (2/28)లు భారత్ పతనాన్ని శాసించగా.. రకిబుల్ హసన్ ఒక వికెట్ తీశాడు. ఇక భారత ఇన్నింగ్స్లో ఇద్దరు బ్యాట్స్మన్ రనౌట్గా వెనుదిరిగడం విశేషం.
అనంతరం 178 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బంగ్లాదేశ్.. 42.1 ఓవరలో ఏడు వికెట్లకు 170 పరుగుల(డక్వర్త్ లూయిస్ ప్రకారం ) చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ పర్వెజ్ హుస్సెన్ ఎమోన్ (79 బంతుల్లో 7 ఫోర్లతో 47) అద్భుత పోరాటానికి తోడుగా కెప్టెన్ అక్బర్ అలీ(43 నాటౌట్), రకీబుల్ హసన్(25 బంతుల్లో 9 నాటౌట్) కడవరకు నిలిచి విజయాన్నందించారు.
41 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసిన బంగ్లా.. విజయానికి ఇంకా 54 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఫలితాన్ని 30 బంతుల్లో 7 పరుగులుగా నిర్ణయించారు.
అనంతరం మైదానంలోకి వచ్చిన బంగ్లా ఆటగాళ్లు 23 బంతుల మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. ఇక భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్(4/30) అద్భుత ప్రదర్శన కనబర్చగా.. సుశాంత్ మిశ్రా రెండు వికెట్లు, యశస్వి జైస్వాల్ ఒక వికెట్ తీశారు. నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో మొత్తం 400 పరుగులతో టోర్నీ టాప్స్కోరర్గా నిలిచిన యశస్వి జైస్వాల్ను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.