అండర్ 19 ప్రపంచకప్ 2026లో భారత్ జోరు కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు డీఎల్ఎస్ పద్దతిన 18 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను ముందుగా 49 ఓవర్లకు ఆ తర్వాత 29 ఓవర్లకు కుదించి ఆడించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ(67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72), అభిజ్ఞాన్ కుండు(112 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 80) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫర్హాద్(5/38) ఐదు వికెట్లు తీయగా..ఇక్బాల్ హొస్సేన్, అజిజుల్ హకీమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ పర్వేజ్ జిబాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం బంగ్లాదేశ్ 28.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అజిజుల్ హకీమ్(72 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. రిఫత్ బెగ్(37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 37) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్(2/35) రెండు వికెట్లు తీయగా.. విహాన్ మల్హోత్రా(4/14) నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపేష్ దేవంద్రన్, హెనిల్ పటేల్, కాన్షిక్ చౌహన్ తలో వికెట్ తీసారు.

239 పరుగుల లక్ష్య ఛేదనలో ఓ దశలో బంగ్లాదేశ్ 90/2తో పటిష్టంగా కనిపించింది. కానీ వర్షం అంతరాయంతో సీన్ మొత్తం మారిపోయింది. వర్షం కారణంగా 90 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. దాంతో అంపైర్లు ఓవర్లను కుదించి టార్గెట్ మార్చారు. దాంతో 29 ఓవర్లలో బంగ్లా విజయానికి 165 పరుగులు అవసరమయ్యాయి. కానీ విహాన్ మల్హోత్రా నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది.
కలామ్ సిద్దిఖీ(15)ని ఔట్ చేసిన మల్హోత్రా మూడో వికెట్కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. విహాన్ మల్హోత్ర ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. హెనిల్ పటేల్ ఆఖరి వికెట్ను ఖాతాలో వేసుకోవడంతో బంగ్లాదేశ్ కథ ముగిసింది.