U19 World Cup 2026 టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరింది. అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఓటమెరుగని జట్టుగా భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్(104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లతో 115) అద్భుత శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026 చరిత్రలోనే అత్యధిక రికార్డ్ ఛేజ్.
311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 41.1 ఓవర్లలో 3 వికెట్లకు 311 పరుగులు చేసి 53 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఆరోన్ జార్జ్తో పాటు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 68), ఆయుష్ మాత్రే(59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. విహాన్ మల్హోత్ర(47 బంతుల్లో 3 ఫోర్లతో 38 నాటౌట్) అజేయంగా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్జాయ్(2/64) రెండు వికెట్లు తీయగా.. వాహిదుల్లా జడ్రాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఫైసల్ షినోజాడా(93 బంతుల్లో 15 ఫోర్లతో 110), ఉజైరుల్లా నియాజై(86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 101 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు ఉస్మాన్ సదత్(70 బంతుల్లో 3 ఫోర్లతో 39), ఖలిద్ అహ్మద్జై(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 31) మెరుగైన ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో దీపేష్ దేవండ్రైన్(2/64), కాన్షిక్ చౌహన్(2/55) రెండేసి వికెట్లు తీసారు. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు.
లక్ష్య ఛేదనలో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. తనకే సాధ్యమైన ఆటతో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 68 పరుగులు చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తొలి వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. క్రీజులో ఉన్నంత సేపు అఫ్గాన్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను అఫ్గాన్ ఫీల్డర్ ఉజైరుల్లా నియాజై వదిలేసాడు. ఈ అవకాశాన్ని వైభవ్ సూర్యవంశీ అందిపుచ్చుకున్నాడు. ఆరోన్ జార్జ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను కూడా అఫ్గాన్ ఫీల్డర్ వదిలేసాడు.
వైభవ్ ఔటైనా.. ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ సత్తా చాటారు. 52 బంతుల్లో ఆరోన్ హాఫ్ సెంచరీ సాధించగా.. 43 బంతుల్లో ఆయుష్ మాత్రే అర్థశతకాన్ని అందుకున్నాడు. 114 పరుగుల భాగస్వామ్యం అనంతరం ఆయుష్ మాత్రే ఔటవ్వగా.. విహాన్ మల్హోత్రతో కలిసి ఆరోన్ జార్జ్ చెలరేగాడు. 95 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అతను విజయం ముంగిట ఔటయ్యాడు. వేదాంత్ త్రివేది(5) సాయంతో విహాల్ మల్హోత్ర(38 నాటౌట్) భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.