అండర్ 19 ప్రపంచకప్ 2024లో యంగ్ ఇండియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 84 పరుగుల తేడాతో ఘన విజయాం సాధించింది. బ్యాటింగ్లో ఆదర్శ్ సింగ్(96 బంతుల్లో 6 ఫోర్లతో 76), కెప్టెన్ ఉదయ్ శరణ్(94 బంతుల్లో 4 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. బౌలింగ్లోసౌమీ పాండే(4/24) బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. తెలుగు తేజం అరవెల్లి అవినాష్(17 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23) మెరుపులు మెరిపించాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 167 పరుగులకు కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహమ్మద్ షిహాబ్ జేమ్స్(77 బంతుల్లో 7 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. అరిఫుల్ ఇస్లామ్(71 బంతుల్లో 3 ఫోర్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. భారత బౌలర్లలో సౌమీ పాండే నాలుగు వికెట్లు తీయగా.. ముషీర్ ఖాన్ రెండు, రాజ్ లింబాని, అర్షిన్ కులకర్ణి, ప్రియాన్షు మోలియా తలో వికెట్ తీసారు.
252 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు ఆషికర్ రెహ్మాన్(14), జిషాన్ అలామ్(14) శుభారంభం అందించే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీని రాజ్ లింబాని విడదీసాడు. జిషాన్ అలామ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన చౌదుర్ రిజ్వాన్(0)ను పాండే డకౌట్ చేశాడు.
అషికర్ రెహ్మాన్ను పాండే క్లీన్ బౌల్డ్ చేయగా.. అహ్రార్ ఇస్లామ్(5) ను కులకర్ణి వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో బంగ్లాదేశ్ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అరిఫుల్ ఇస్లామ్, మహమ్మద్ జేమ్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో వికెట్కు 77 పరుగుల జోడించింది.
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ముషీర్ ఖాన్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన ఇస్లామ్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ పెవిలియన్ చేరగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మహమ్మద్ జేమ్స్ను ముషీర్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.