అండర్ 19 ప్రపంచకప్ 2024లో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఉదయ్ శరణ్ సారథ్యంలోని యంగ్ ఇండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్తో గురువారం జరిగిన మ్యాచ్లో 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముషీర్ ఖాన్(106 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 118) విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ -19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 301 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముషీర్ ఖాన్కు తోడుగా కెప్టెన్ ఉదయ్ శరణ్(84 బంతుల్లో 5 ఫోర్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు. తెలుగు తేజం అరవెల్లీ అవినాష్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22) మెరుపులు మెరిపించాడు.

ఐర్లాండ్ బౌలర్లలో ఓలివర్ రిలీ మూడు వికెట్లు తీయగా.. జాన్ మెక్ నాల్లీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫిలుట్టన్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకు కుప్పకూలింది.
డానియెల్ ఫోర్కిన్(27 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నమాన్ తివారీ 4 వికెట్లు తీయగా.. సౌమి పాండే 3 వికెట్లు పడగొట్టాడు. ధనుష్ గౌడ, మురుగణ్ అభిషేక్, ఉదయ్ శరణ్ తలో వికెట్ తీసారు.
తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 84 పరుగులతో మట్టికరిపించిన భారత్.. 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం అమెరికా జట్టుతో ఆడనుంది.