
కూలిడ్జ్: అండర్ 19 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ పిచ్, నాకౌట్ ప్రెజర్ హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో బ్యాటింగ్కే మొగ్గు చూపాడు. ఇక బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రఘు వంశీ(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దాంతో క్రీజులోకి తెలుగు క్రికెటర్ షేక్ రషీద్ రాగా.. మరో ఓపెనర్ హర్నూర్ సింగ్(6) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తుండటంతో భారత్ డిఫెన్స్కే పరిమితమవుతోంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 18 పరుగులు మాత్రమే చేసింది.
గత రెండు అండర్-19 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన యువ భారత్.. మరోసారి హిస్టరీని రిపీట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంది. 2018 ఫైనల్లో పృథ్వీ షా నాయకత్వంలోని జట్టు ఆసీస్ను ఓడించి టైటిల్ గెలుచుకోగా... 2020 క్వార్టర్ ఫైనల్లో టీమిండియా.. యువ కంగారూ జట్టుకు షాకిచ్చింది.
ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్ గత ఎడిషన్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి కొద్దిలో ట్రోఫీ మిస్ చేసుకుంది. కానీ, మొన్నటి క్వార్టర్స్లో బంగ్లాను ఓడించి సెమీస్కు వచ్చిన టీమ్.. అదే జోరుతో ఆసీస్ పని పట్టి కప్పు ముంగిట నిలవాలని చూస్తోంది. అయితే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఆసీస్ టీమ్ను తక్కువ అంచనా వేయలేం. ఇప్పటికే రెండు సార్లు ఈ మెగా టోర్నీ టైటిల్ గెలిచిన కంగారు టీమ్ 2010 తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవలేదు. ఆ లోటును ఈసారి తీర్చుకోవాలని భావిస్తోంది.