అండర్ 19 మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ ఫైనల్ చేరింది. శుక్రవారం ఆతిథ్య శ్రీలంకతో జరిగిన సూపర్-4 చివరి మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు తేజం గొంగడి త్రిష(24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 32)దూకుడుగా ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక అండర్ 19 మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులే చేసింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా(4/10) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షబ్నమ్ షకిల్, ద్రితీ కేసరి తలో వికెట్ తీసారు. అనంతరం భారత మహిళల జట్టు త్రిష సూపర్ బ్యాటింగ్తో 14.5 ఓవర్లలోనే 6 వికెట్లకు 102 పరుగులు చేసి గెలుపొందింది. త్రిషతో పాటు కమలిని(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28) రాణించింది.

ఈ గెలుపుతో మూడు విజయాలు, ఒక డ్రాతో సూపర్-4 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఫైనల్కు అర్హత సాధించింది. మూడు విజయాలు ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం కౌలలాంపుర్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.