
బెనోని (సౌతాఫ్రికా): మొట్టమొదటి మహిళల అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన షెఫాలీ వర్మ నేతృత్వంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. షెఫాలీ వర్మ( 16 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 45), (2/31) ఆల్రౌండ్ ప్రదర్శనకు ఓపెనర్ శ్వేత షెహ్రావత్(57 బంతుల్లో 20 ఫోర్లతో 92 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. సిమోన్ లౌరెన్స్(44 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. మాడిసన్ లాండ్స్మన్(17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32) ధాటిగా ఆడింది. భారత బౌలర్లలో షెఫాలీ వర్మకు రెండు వికెట్లు దక్కగా.. సోనమ్ యాదవ్, పర్షావి చోప్రాకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెప్టెన్ షెఫాలీ వర్మ, శ్వేతా షెహ్రావత్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ బోణీ కొట్టింది. తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష(15) నిరాశపర్చగా.. బౌలర్ అయిన మరో అమ్మాయి షబ్నమ్ ఒకే ఓవర్లో 20 పరుగులిచ్చింది. లక్ష్యచేధనలో దూకుడుగా ఆరంభించిన భారత అమ్మాయిలు.. సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో షెఫాలీ వర్మ 4,4,4,4,4,6 వరుసగా 6 బంతుల్లో 6 బౌండరీలు బాదింది. షెఫాలీ దెబ్బకు సౌతాఫ్రికా బౌలర్ న్టాబిసెంగ్ నిని ఒకే ఓవర్లో 30 పరుగులిచ్చుకుంది.
ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు 4 గ్రూపులుగా విడిపోయి 4 వేదికల్లో తలపడుతునున్నాయి. గ్రూప్-డిలో ఉన్న భారత్ జట్టు తదుపరి మ్యాచ్ల్లో జనవరి 16న యూఏఈతో, 18న స్కాట్లాండ్తో తలపడుతుంది. 2021లోనే ఈ ప్రపంచకప్ జరగాల్సి ఉండగా కొవిడ్ మహమ్మారి కారణంగా 2023కు వాయిదా పడింది. భారత్తో పాటు ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే ఈ టోర్నీకి నేరుగా బెర్తు దక్కించుకున్నాయి. అర్హత టోర్నీల ద్వారా అమెరికా, యూఏఈ, రువాండా, స్కాట్లాండ్, ఇండోనేసియా కూడా ఈ మెగా ఈవెంట్లో ఆడే అవకాశాన్ని సంపాదించాయి.