పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ యూటర్న్ స్పెషలిస్ట్ అని, అది చేసిన పనికి ప్రపంచం ముందు పాకిస్థాన్ నవ్వుల పాలైందని మండిపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్పై నెలకొన్న సందిగ్దతకు తెరపడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్కు సంఘీభావంగా ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్థాన్.. చివరకు ఐసీసీ చర్చలతో తలొగ్గింది. ఇతర దేశాల సూచనలతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం( ఫిబ్రవరి 15న) ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) యూటర్న్ తీసుకోవడంపై డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరు ఇలానే ఉంటుందని, తాను ముందే చెప్పానని గుర్తు చేశాడు. పీసీబీ నిలకడలేని స్వభావాన్ని ఎండగట్టాడు.
పాక్ను చూసి నవ్వుతున్నారు..
'ప్రతిదానికి ఒక హద్దుంటుంది. ఈ డ్రామా ఇక్కడితో ఆగదని, వారు ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని మార్చుకుంటారని నేను ముందే చెప్పాను. ఎందుకంటే వారు మాట మార్చడంలో నిపుణులు. యూటర్న్ స్పెషలిస్ట్లు. నిర్ణయాలు మార్చుకునేవారిలో వీళ్లను మించి మరెవ్వరినీ చూడలేదు. ఒక సమయంలో ఒకటి చెబుతారు, మరుక్షణమే పూర్తిగా భిన్నమైనది చెబుతారు. పాకిస్థాన్ ఈ చర్యలను చూసి ప్రపంచమంతా నవ్వుతోంది.’ అని కనేరియా విమర్శలు గుప్పించాడు.
పీసీబీ డ్రామాతో బంగ్లాదేశ్ సమస్యను ఐసీసీ పరిష్కరించింది. కానీ పాకిస్థాన్ బోర్డుకు బంగ్లాదేశ్ ఎప్పుడు సాయం చేసిందని కనేరియా నిలదీసాడు. 'మ్యాచ్ను బహిష్కరిస్తామని పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడేమైంది? అకస్మాత్తుగా మిమ్మల్ని ఆడేలా మార్చిందేమిటి?" అంటూ పీసీబీ వైఖరిని నిలదీశారు.
ఆంక్షలకు భయపడి..
పీసీబీ యూటర్న్కు ఐసీసీ ఒత్తిడే ప్రధాన కారణం. భారత్తో ఆడేందుకు నిరాకరిస్తే, ఎదురయ్యే తీవ్ర పరిణామాలపై ఐసీసీ కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐసీసీ సమావేశంలో భారత్తో ద్వైపాక్షిక సిరీస్ల కోసం పాకిస్థాన్ డిమాండ్ చేసినప్పటికీ, ఐసీసీ విధించబోయే ఆంక్షలకు భయపడి నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. తమ మాట వినకపోతే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. నిషేధం కూడి విధిస్తామని పాకిస్థాన్ను ఐసీసీ హెచ్చరించింది.
అంతేగాకుండా.., పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీలు) ఇవ్వబోమని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ తీవ్ర పరిణామాలను ఎదుర్కోనలేకనే పీసీబీ వెనక్కి తగ్గిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పరిణామాలను కూడా కనేరియా తన వీడియోలో ప్రస్తావించాడు. 'భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని అకస్మాత్తుగా ప్రకటించడంలో అర్థం లేదు. ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి. అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకుని మీడియాలో సంచలనం సృష్టించడం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఈ వివాదం భవిష్యత్తులో పీసీబీకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇదంతా చూస్తుంటే నాకు విడ్డూరంగా ఉంది.
24 గంటలు మీడియాలో ఉండాలని ఏదో ఒకటి చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గడం అనవసరం. ఐసీసీకి వ్యతిరేకంగా మీరు ఏం చేయగలిగారు? ఏమీ చేయలేకపోయారు. ఇది భవిష్యత్తులో మీకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుంది’అని కనేరియా పీసీబీని హెచ్చరించాడు.
ఐసీసీ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ మరే మ్యాచ్కు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్ ద్వారానే ఐసీసీకి అత్యధిక ఆదాయం వస్తుంది. అందుకే ప్రతీ ఐసీసీ టోర్నీలో భారత్, పాక్ కనీసం ఒక్క మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ సిద్దం చేస్తోంది. గత ఐదు సార్లు భారత్తో తలపడిన అన్ని మ్యాచ్ల్లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న పాక్ జట్టు, ఈసారి భారత్పై తమ పేలవ రికార్డును మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాక్పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.