ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం భారత్లో పర్యటిస్తున్న ఆసీస్ మహిళల టీమ్.. ఇంగ్లండ్తో మ్యాచ్ కోసం ఇండోర్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వేదికగా నేడు(శనివారం) సౌతాఫ్రికాతో ఆసీస్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఆసీస్కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
హోటల్ గది నుంచి కెఫేకు తమ ప్లేయర్లు నడిచివెళ్తుండగా నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆసీస్ టీమ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంతో పాటు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడు అకీల్ను అందుపులోకి తీసుకున్నారు. ఇండోర్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఆసీస్ ప్లేయర్లు ఉంటున్నారు. గత గురువారం ఆసీస్ మహిళా ప్లేయర్లకు వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సెమీస్ చేరిన ఆసీస్.. టాప్ ప్లేస్పై కన్నేసింది. సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించి అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటుంది. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్కు అర్హత సాధించాయి. నాలుగో ప్లేస్లో ఉన్న టీమిండియా అగ్రస్థానంలో ఉన్న టీమ్తో సెమీస్ ఆడనుంది. భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను ఆదివారం బంగ్లాదేశ్తో నవీ ముంబై వేదికగా ఆడనుంది. సౌతాఫ్రికాపై తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధిస్తే సెమీస్లో భారత్తో సెమీఫైనల్ ఆడుతుంది. లేదంటే సౌతాఫ్రికా, భారత్ తలపడాల్సి ఉంటుంది.