ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని కెప్టెన్ను మార్చేసింది. ముంబై ఇండియన్స్కు తొలి టైటిల్ అందించడంతో పాటు ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టి.. సక్సెస్ఫుల్ టీమ్ తీర్చిదిద్దిన రోహిత్ శర్మను పక్కనపెట్టేసింది. అతని ఘన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను ఇటీవలే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.
ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. భావోద్వేగపూరితమైన పోస్ట్లు పెడుతున్నారు. ముఖ్యంగా టీమ్ ఓనర్ ముఖేష్ అంబానీని ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తున్నారు.

'ఇది అన్యాయం అంబానీ గారూ..! రోహిత్ శర్మను వరల్డ్ బెస్ట్ కెప్టెన్గా తీర్చిదిద్దిన మీరు.. అతనికి సరైన వీడ్కోలు పలకపోవడం ముమ్మాటికీ అన్యాయమే. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు సారథ్య బాధ్యతలు అందుకొని.. కెప్టెన్సీ చేసిన ఫస్ట్ సీజన్లోనే టైటిల్ అందించిన రోహిత్ శర్మను ఇలా అవమానించడం మీకు తగదు.
2013, 2015, 2017,2019,2020 సీజన్లలో ఛాంపియన్గా నిలబెట్టి ఐపీఎల్లోనే సక్సెస్ఫుల్ టీమ్గా నిలబెట్టిన రోహిత్ శర్మను తన చివరి మ్యాచ్ వరకు కెప్టెన్గా కొనసాగించాల్సింది. ముంబై సక్సెస్లో రోహిత్ శర్మ పాత్ర ఎంత ఉందో.. హిట్ మ్యాన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్గా ఎదగడంలో మీ పాత్ర అంతే ఉంది. ఆ విషయాన్ని మేం కాదనడం లేదు.
కానీ తనదైన సారథ్యంతో జట్టు విలువను రూ. 725 కోట్లకు పెంచిన రోహిత్ శర్మను ఇంకాస్త గౌరవం ఇవ్వాల్సింది. దిగ్గజ వ్యాపారి అయిన మీరు.. అభిమానుల మనసులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది. ఏది ఏమైనా ఈ విషయంలో రోహిత్ శర్మను సంప్రదించి అతని అంగీకారంతోనే ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకున్నారని మేం భావిస్తున్నాం.
హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చినప్పుడే భవిష్యత్తు సారథి అతనే అనే విషయం మేం గ్రహించాం. కానీ ఆ నిర్ణయం ఇంత త్వరగా ఉంటుందని ఊహించలేకపోయాం. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన, ఆకర్షణీయమైన ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్లో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.'అని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.