ఇంగ్లండ్ పర్యటనను శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత సీనియర్ టీమ్ ఓటమితో ప్రారంభిస్తే.. అండర్ 19 టీమ్ మాత్రం విజయంతో మొదలుపెట్టింది. ఇంగ్లండ్ అండర్ 19తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్లో భారత అండర్ 19 జట్టు 231 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత అండర్ 19 జట్టుకు ఐపీఎల్ సెన్సేషన్ ఆయుష్ మాత్రే సారథ్యం వహిస్తుండగా.. 14 ఏళ్ల సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఈ ఇద్దరూ విఫలమైనా.. ట్రక్కు డ్రైవర్ కొడుకు హర్వాన్ష్ శతకంతో చెలరేగాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 444 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇంగ్లండ్ యంగ్ టీమ్కు బజ్బాల్ రుచి చూపించారు. గుజరాత్కు చెందిన హర్వాన్ష్ పంగాలియా(52 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లతో 103 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. రాహుల్ కుమార్(60 బంతుల్లో 73), కనిష్క చౌహన్(67 బంతుల్లో 79), అంబ్రిష్(47 బంతుల్లో 72) హాప్ సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం ఇంగ్లండ్ లయన్స్ 41.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఆయుష్ మాత్రే(1), వైభవ్ సూర్యవంశీ(17)లు నిరాశపర్చారు.

సెంచరీతో చెలరేగిన భారత వికెట్ కీపర్ హర్వాన్ష్ పంగాలియాది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లోని గాంధీదామ్ అనే చిన్నపట్టణం. అయితే వీరి కుటుంబం కెనడాలో స్థిరపడింది. అక్కడ అతని తండ్రి బ్రాంప్టన్లో ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.