
అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మంచి మనసు చాటుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2022 క్వాలిఫయర్-2 మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ ఫైట్కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుండగా.. ఓ బుడ్డోడు స్టేడియంలోని స్టాండ్స్లో తనని పిలుస్తూ కనిపించాడు.
దాంతో.. ఆగి అతనితో మాట్లాడిన బౌల్ట్.. చివరికి తన జెర్సీని తీసి అతనికి గిప్ట్గా ఇచ్చేశాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్ వేదికగా పంచుకుంది. వాస్తవానికి ఆ బుడ్డోడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ అభిమాని కాదు. అతను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ జెర్సీ వేసుకుని కనిపించాడు. అయినప్పటికీ.. ట్రెంట్ బౌల్ట్ తాను వేసుకున్న జెర్సీని తీసి బుడ్డోడికి ఇవ్వడం గమనార్హం.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ట్రెంట్ బౌల్ట్ జెర్సీ తీయగానే సదరు బుడ్డోడు కూడా తాను వేసుకున్న ఆర్సీబీ జెర్సీని తీసేశాడు. దాంతో.. ట్రెంట్ బౌల్ట్ ఆ ఆర్సీబీ జెర్సీని తనకి ఇవ్వాలనుకుంటున్నాడేమో అని భ్రమపడి.. 'నీ జెర్సీ నాకొద్దు'అంటూ అలానే షర్ట్ లేకుండా నవ్వుతూ వెళ్లిపోయాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌ ట్; 10 ఫోర్లు, 6 సిక్స్ లు) సీజన్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. రేపు ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ తలపడుతుంది.