న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఉగాండతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ఉగాండాను 40 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్.. అనంతరం 5.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్ని అందుకుంది.
అయితే ఈ టోర్నీలో గ్రూప్ సీలో పోటీ పడిన కివీస్.. పసికూన అఫ్గానిస్థాన్తో పాటు ఆతిథ్య వెస్టిండీస్ చేతిలో ఓడి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2014 టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ సెమీస్ చేరకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇక ఉగాండాతో విజయానంతరం మాట్లాడిన ట్రెంట్ బౌల్ట్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని చెప్పిన బౌల్ట్.. అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగడంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజా టీ20 ప్రపంచకప్ల్లో జట్లన్నీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయని, నేపాల్ ఒక్క పరుగు తేడాతో ఓడి టోర్నీలో ముందడుగు వేయలేకపోయిందన్నాడు. లీగ్ దశలో వెనుదిరిగినా.. న్యూజిలాండ్ బౌన్స్ బ్యాక్ అవుతుందని, అలా అయ్యేందుకు కావాల్సిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని బౌల్ట్ తెలిపాడు.
'ఈ టోర్నీలో తీవ్ర పోటీ ఉంది. నేపాల్ ఒక్క పరుగు తేడాతో టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. ఈ ఫలితం ఈ టోర్నీ యొక్క నాణ్యతను తెలియజేస్తోంది. దురదృష్టవశాత్తు ఈ టోర్నీ ఆరంభంలోనే మేం విఫలమయ్యాం. అదే మా జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. వ్యక్తిగతంగా నాకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్.
జట్టును విజేతగా నిలబెట్టేందుకే మేం ఈ టోర్నీ ఆడాం. దురదృష్టవశాత్తు మేం ఆ పని చేయలేకపోయాం. పేలవ ప్రదర్శనతో సూపర్ 8కు అర్హత సాధించలేకపోయాం. ఈ పరాజయం న్యూజిలాండ్ క్రికెట్ కీర్తిని తక్కువ చేయదు. జట్టు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కావాల్సిన ఆటగాళ్లు ఉన్నారు. మళ్లీ నేలకు కొట్టిన బంతిలా న్యూజిలాండ్ పుంజుకుంటుంది.'అని ట్రెంట్ బౌల్ట్ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ల్లో 17 మ్యాచ్లు ఆడిన బౌల్ట్ 6.07 ఎకానమీతో 32 వికెట్లు తీసాడు. ఫ్రాంచైజీ క్రికెట్కు ప్రాధాన్యత ఇస్తున్న బౌల్ట్.. గతంలోనే ఆ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకున్నాడు. తాజా నిర్ణయంతో బౌల్ట్.. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది.