ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్.. టీమిండియాకు తలనొప్పిగా మారాడు. రెండేళ్ల ముందు వరకు మాములు మిడిలార్డర్ బ్యాటర్గా కొనసాగిన ఈ ఆసీస్ స్టార్.. ప్రస్తుతం ప్రపంచంలోనే విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. విధ్వంసకర బ్యాటింగ్తో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చడం అతని ప్రత్యేకత.
ట్రావిస్ హెడ్కు బలైన జట్టు ఏదైనా ఉందా? అంటే అది టీమిండియానే. అతని కెరీర్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ అన్నీ భారత జట్టుపైనే వచ్చాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ నుంచి మొదలైన అతని విధ్వంసం.. తాజా గులాబీ టెస్ట్ వరకు కొనసాగుతూనే ఉంది.

రెండు టెటిళ్లు గోవిందా..
ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ట్రావిస్ హెడ్ 163 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో టీమిండియాకు టైటిల్ దూరం చేశాడు. ఆ తర్వాత భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ 137 పరుగుల మెరుపు శతకంతో టైటిల్ ఎగురేసుకుపోయింది. ఈ రెండు మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ కొట్టిన దెబ్బలను టీమిండియా అంత సులువుగా మరిచిపోలేదు.
ఇప్పుడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన భారత్ను అతనే దెబ్బతీసాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న గులాబీ టెస్ట్లో ఆస్ట్రేలియాకు అతనే అపద్భాంధవుడిలా మారాడు. ధనాధన్ సెంచరీతో ఆసీస్ను విజయం ముంగిట నిలబెట్టాడు. సిరీస్ను మలుపు తిప్పే శతకమని మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

భారత్ అంటే పూనకాలే..
తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీతోనే ట్రావిస్ హెడ్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ అతన్ని కట్టడి చేసేందుకు టీమిండియా ఎలాంటి ప్రణాళికలను సిద్దం చేయకుండా మూల్యం చెల్లించుకుంది. 63 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్.. మరో 48 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రతీ బౌలర్ను చెడుగుడు ఆడాడు.
గతేడాది నుంచి ట్రావిస్ హెడ్.. భారత్పై మూడు ఫార్మాట్లలో కలిపి 19 ఇన్నింగ్స్లు ఆడి 61.9 సగటుతో 1052 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. ఇదే కాలంలో ఇతర జట్లపై 54 ఇన్నింగ్స్లు ఆడిన హెడ్ 36.8 సగటుతో 1875 పరుగులే చేశాడు. ఇందులో 10 సెంచరీలు ఉండగా.. 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ గణంకాలను చూస్తేనే భారత్పై ట్రావిస్ హెడ్ ఎలా చెలరేగిపోతున్నాడో అర్థమవుతోంది. ఇప్పటికైనా ట్రావిస్ హెడ్ బలహీనతలపై ఫోకస్ పెట్టి.. అతన్ని కట్టడి చేసే వ్యూహాలు రచించాలని, లేకపోతే ఈ సిరీస్లో టీమిండియాకు అతను మొగుడిలా తయారవుతాడని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.