టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం వల్లే తమ విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. ఈ విజయంతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 3-1తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా చేరుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన ట్రావిస్ హెడ్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సిరీస్లో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. తాను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి తాను చూసి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన బుమ్రాదేనని అభిప్రాయపడ్డాడు.

'జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో మా విజయం సులువైంది. ఈ సిరీస్లో బుమ్రా మాకు ఎన్నో పీడకలలు మిగిల్చాడు. బుమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్ను ఎదుర్కొన్నామని భవిష్యత్తులో కథలు కథలుగా చెప్పుకుంటాం. సిడ్నీ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ చేయడం లేదనే విషయం తెలిసి మా డ్రెస్సింగ్ రూమ్ అంతా సంతోషంలో మునిగిపోయింది. మా జట్టులోని 15 మంది ఆటగాళ్లను బుమ్రా తన బౌలింగ్తో భయపెట్టాడు.
నా టెస్ట్ కెరీర్లో నేను చూసిన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన బుమ్రాదే. ఈ సిరీస్లో అతను మాకు నరకం చూపించాడు. బుమ్రాకు ఇది అసాధారణ సిరీస్గా మిగిలిపోతుంది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభ గురించి నాకు తెలుసు.
చివరి టెస్ట్లో లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడాం. మూమెంటమ్ కోసం వేచి చూశాం. 20, 30 పరుగులు చేసినా విజయం సాధించవచ్చని భావించాం. గత రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉస్మాన్ ఖవాజాతో చిన్న భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. బ్యూ వెబ్స్టర్తో అదే మూమెంటమ్ను కొనసాగించాను. 'అని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్లో ట్రావిస్ హెడ్ 56 సగటుతో 448 పరుగులు చేసి హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ టీమిండియా పతనాన్ని శాసించింది. జస్ప్రీత్ బుమ్రా 9 ఇన్నింగ్స్ల్లో 32 వికెట్లు తీసాడు. సిడ్నీ టెస్ట్లో అతను కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. వెన్ను గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు. లేదంటే మరో 5-8 వికెట్లు ఖాతాలో వేసుకునేవాడు. ఈ సిరీస్లో భారత్ ఓడినా.. 32 వికెట్లు తీసిన బుమ్రానే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ వరించింది.