టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తనను అపార్థం చేసుకున్నాడని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్, సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ అన్నాడు. అతని బౌలింగ్లో ఔటైన తర్వాత బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నానని, సిరాజ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెండాఫ్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. వన్డే తరహా బ్యాటింగ్తో 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్లతో 140 పరుగులు చేశాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ట్రావిస్ హెడ్ను మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు.

అనంతరం ఆగ్రహంగా సంబరాలు చేసుకోగా.. ట్రావిస్ హెడ్ నోటికి పనిచెప్పాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సిరాజ్.. 'ఛల్ పో బే.. పో'అన్నట్లు సైగ చేశాడు. దాంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఘటనతో ఆసీస్ అభిమానుల దృష్టిలో సిరాజ్ విలన్గా మారిపోయాడు. దాంతో వారు అతన్ని ఎగతాళి చేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై ట్రావిస్ హెడ్ స్పందించాడు. అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ వివరణ ఇచ్చాడు. తాను సిరాజ్ను మెచ్చుకున్నానని, కానీ అతను అపార్థం చేసుకున్నాడని చెప్పాడు. 'నేను బాగా బౌలింగ్ చేశావ్ అన్నాను. కానీ అతను మరోలా అనుకున్నాడు. సిరాజ్ ప్రవర్తించిన తీరు బాధకు గురిచేసింది. మైదానం బయటకు వెళ్లిపోమని సూచించడం కోపం తెప్పించింది. వారు అలా రియాక్ట్ అవ్వాలనుకున్నారు కాబట్టే అలా ప్రవర్తించారు. గత రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యానని ఇలా రియాక్ట్ అయ్యారు. 'అని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. అద్భుతమైన బ్యాటింగ్, అసాధారణ బౌలింగ్తో ఈ మ్యాచ్పై ఆసీస్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్(28 బ్యాటింగ్), నితీష్ కుమార్ రెడ్డి(15 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్లతో 140) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(126 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/98), జస్ప్రీత్ బుమ్రా(4/61) నాలుగేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక రెండో రోజు ఆటలో టీమిండియా పూర్తిగా తేలిపోయింది. మూడు సెషన్లలో ఆసీస్ ఆధిపత్యమే నడిచింది. మూడో రోజు ఆటలో పంత్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేస్తే తప్పా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కదు.