టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై తనకున్న అభిమానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ చాటుకున్నాడు. వైట్బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. రోహిత్ శర్మతో కలిసి ఆడే అవకాశం ఇప్పటి వరకు రాలేదని, ఏదో ఒక రోజు అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీ, రోహిత్ శర్మల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కంటే రోహిత్ ఏ విషయంలోనూ తక్కువ కాదని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనే ఈ ఇద్దరూ వీడ్కోలు పలికే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఆడుతారని ఆశిస్తున్నానని తెలిపాడు.

'రోహిత్, కోహ్లీ భారత జట్టుకు ఎంతో చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ ఇద్దరూ అసాధారణమైన ఆటగాళ్లు. బహుషా కోహ్లీ గొప్ప వైట్ బాల్ క్రికెటర్ కావచ్చు. కానీ రోహిత్ అతని కంటే ఏ మాత్రం తక్కువ కాదు. అతను తనదైన శైలిలో ఓపెనింగ్ చేసే బ్యాటర్. అతను సాధించిన ఘనతలపై నాకు చాలా గౌరవం ఉంది. ఏదో ఒక దశలో ఈ ఇద్దరి ఆటగాళ్లను మిస్సవుతాం. అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడుతారని అనుకుంటున్నాను. కనీసం ఆ టోర్నీ ఆడేందుకైనా వారు ప్రయత్నిస్తారు.
రోహిత్ శర్మతో కలిసి ఆడే అవకాశం వస్తే గొప్పగా భావిస్తా. ఇప్పటి వరకైతే అతనితో కలిసి ఆడే అవకాశం దక్కలేదు. మనలానే ఆడే ఆటగాడిని దూరం నుంచి చూడటం బాగుంటుంది. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్లో రోహిత్కు ప్రత్యర్థిగా చాలా మ్యాచ్లు ఆడాను. అతను సరైన పద్దతిలో ఆడుతాడు. అయితే అతనితో కలిసి ఆడే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం రావచ్చు. అతను మరింత సుదీర్ఘం కాలం ఆడుతాడు. అప్పుడు నాకు అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే ఛాన్స్ దక్కవచ్చు. అతను ఓపెనింగ్ చేసినా ఒకేలా ఆడుతాడు. బెస్ట్ బ్యాటర్ నుంచి ఎందుకు నేర్చుకోకూడదు.'అని ట్రావిస్ హెడ్ అన్నాడు.