బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే విజయం సాధించేవాళ్లమని చెప్పాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది.
తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా ఓటమెరుగని జట్టుగా టైటిల్ అందుకుంది. 9వ ఆసియాకప్ను ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సల్మాన్ అలీ అఘా.. వీలైనంత త్వరగా తమ బ్యాటింగ్ను మెరుగుపర్చుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఫైనల్లో ఓడినా..తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పాడు. 'ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్ వైఫల్యం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మా బ్యాటింగ్లో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం.

బౌలింగ్లో అద్భుతంగా రాణించినప్పటికీ.. బోర్డుపై సరిపడా పరుగులు లేవు. స్ట్రైక్ రొటేట్ చేయకుండా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. మేం మ్యా బ్యాటింగ్ను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి 6 ఓవర్లలో భారత్కు 63 పరుగులు అవసరమైనప్పుడు కూడా మేమే గెలుస్తామని అనుకున్నా. కానీ బ్యాటింగ్ వైఫల్యం మాకు తీరని నష్టం చేసింది. ఈ మ్యాచ్లో ఓడినా జట్టు పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది. మేమ మరింత కష్టపడి భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తాం.'అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా.. శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33), సంజూ శాంసన్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(3/29) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.