మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టుకు సౌతాఫ్రికా బిగ్ షాకిచ్చింది. విశాఖ తీరాన గురువారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బౌలింగ్తో గెలవాల్సిన మ్యాచ్లో హర్మన్సేన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ చేసిన అసాధారణ పోరాటం వృథా అయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్(77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో) ఒంటరి పోరాటం చేయగా.. స్నేహ్ రాణా(24 బంతుల్లో 6 ఫోర్లతో 33), ప్రతికా రావల్(56 బంతుల్లో 5 ఫోర్లతో 37) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(23), హర్లీన్ డియోల్(13), హర్మన్ప్రీత్ కౌర్(9), జెమీమా రోడ్రిగ్స్(0), దీప్తి శర్మ(4) మరోసారి నిరాశపర్చారు. దాంతో భారత్ 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కనీసం 200 స్కోర్ అయినా చేస్తుందా? అనిపించింది. కానీ రిచా ఘోష్, స్నేహ్ రాణాతో కలిసి జట్టును ఆదుకుంది. ఈ ఇద్దరూ 8వ వికెట్కు 88 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో సెంచరీ ముంగిట రిచా ఘోష్ వెనుదిరిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రైయాన్(3/32), మరిజేన్ కాప్(2/45), ఎంలబా(2/46), డిక్లెర్క్(2/52) రాణించారు.

అనంతరం సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసి గెలుపొందింది. నదైన్ డిక్లెర్క్(54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 84 నాటౌట్), కెప్టెన్ లారా వోల్వార్ట్(111 బంతుల్లో 8 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. క్లో ట్రైయాన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 49) మెరుపులు మెరిపించింది. లక్ష్యచేధనలో సౌతాఫ్రికా కూడా 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దాంతో భారత విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ లారా వోల్వార్ట్, క్లో ట్రైయాన్, నదైన్ డిక్లెర్క్ సంచలన బ్యాటింగ్తో ఓటమిని తప్పించారు.
చివరి 24 బంతుల్లో సౌతాఫ్రికా విజయానికి 41 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్లు కాస్త కట్టడిగా బౌలింగ్ చేసుంటే ఈజీగా గెలిచేది. కానీ 47వ ఓవర్ వేసిన క్రాంతి గౌడ్ వరుసగా 6, 6, 4 తో 18 పరుగులు సమర్పించుకుంది. దాంతో మూమెంటమ్ మారిపోయింది. దీప్తి శర్మ బౌలింగ్లో రెండు బౌండరీల సాయంతో 11 పరుగులు రావడంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారిపోయింది. అమన్జోత్ కౌర్ బౌలింగ్లో రెండు సిక్స్లు బాదిన నదైన్ డిక్లెర్క్ సౌతాఫ్రికా విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.