న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. గంభీర్ చేసిన వ్యాఖ్యలపై భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచ్లు, సహాయక సిబ్బంది మండిపడుతున్నారు. గౌతమ్ గంభీర్ ఒర్రుబోతు గాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ను మించి సెలెక్టర్లు ఇతరుల వైపు చూడాలని అనుకుంటే అలాగే చేయాలని, సీనియర్ ఆటగాళ్లని వెనకడుగు వేయవద్దని గంభీర్ సూచించాడు.
'సీనియర్ ఆటగాళ్లపై స్పష్టత ఉండాలి. సెలెక్టర్లకు మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఒకవేళ సెలెక్టర్లు వీళ్లను మించి ఇతరులను తీసుకోవాలని నిర్ణయించుకుంటే అలాగే చేయాలి. చాలా దేశాలు ఇలా చేశాయి. సీనియర్లు తొలగించినప్పుడు జరిగే రాద్దాంతం సర్వ సాధారణమే. ఆటలో వ్యక్తుల గురించి ఆలోచించకూడదు. జట్టు లక్ష్యాలే ప్రధానం. వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్లి గెలవాలి. ఇలాంటి వాళ్లు ఇప్పటి వరకు దాన్ని సాధించకపోతే.. సూర్యకుమార్ లాంటి యువ ఆటగాళ్లు ఆ కల నెరవేర్చుతారేమో ఎవరికి తెలుసు.'అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై సీనియర్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెకేషన్లో ఉన్న ఓ టాప్ ప్లేయర్.. ఇన్సైడ్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ గంభీర్ తీరును తప్పుబట్టాడు. 'టీమ్కు వ్యతిరేకంగా గంభీర్ చేసిన వ్యాఖ్యలు చాలా నిరాశకు గురిచేశాయి. భారత క్రికెట్కు అతను చేసిన సేవలను మేం గౌరవిస్తాం. అలాగే అతను కూడా మేం అందించిన సేవలను గౌరవించాలి.'అని సదరు టాప్ ప్లేయర్ గంభీర్పై అసహనం వ్యక్తం చేశాడు.
ఓ బీసీసీఐ అధికారి కూడా గంభీర్ తీరును తప్పుబట్టాడు. 'ప్రస్తుతం గంభీర్కు జట్టుతో సంబంధం లేదు. అతనో ఔట్సైడర్. జట్టు సెటప్లో ఏం జరుగుతోంది అతనికి తెలియదు. అతను అవగాహన లేని విషయాలపై మాట్లాడటం నిరాశపరిచింది. అతనో ఒర్రుబోతుగాడు అంతే.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.
ఇక రాహుల్ ద్రవిడ్ కోచింగ్ తీరును కూడా గంభీర్ తప్పుబట్టాడు.' భారత జట్టులో చాలా మార్పులు జరిగాయి. ఏడాదిలో ఎంతో మంది ప్లేయర్లను మార్చారు. కెప్టెన్లను మార్చారు. ఐసీసీ టైటిల్స్ గెలవాలంటే ఓ స్థిరమైన జట్టు కావాలి. ప్రతీ సిరీస్కోసారి ప్లేయర్లు బ్రేకులు తీసుకుంటూ ఉంటే టీమ్ ఎలా సెటిల్ అవుతుంది. వరల్డ్ కప్ ఆడాలనుకుంటే కోర్ టీమ్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వకూడదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు కూడా వరుసగా సిరీస్లు ఆడాల్సిందే. ఏ ప్లేయర్ అయినా ఒక్కటి రెండు సిరీస్లు ఆడిన తర్వాత రెస్ట్ కావాలంటే అతన్ని వరల్డ్ కప్ టీమ్ నుంచి తప్పించాలి. అతను రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ ఆడాలంటే టీమిండియా ఆడే అన్ని సిరీసుల్లో పాల్గొని తీరాల్సిందే.'అని చెప్పుుకొచ్చాడు.