టీమిండియా నయా ఫినిషర్, టీ20 సెన్సేషన్ రింకూ సింగ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమయ్యాడని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్తో రింకూ సింగ్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ నిశ్చితార్థ వార్తలను ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ ఖండించాడు.
రింకూ సింగ్ కుటుంబం పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చిందని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పెద్ద అల్లుడు ఈ వ్యవహారం చూస్తున్నారని పేర్కొన్నారు. రింకూ సింగ్-ప్రియా సరోజ్ పెళ్లి వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారడంతో తుషానీ సరోజ్ను మీడియా మరో సంప్రదించగా.. రింకూ సింగ్, ప్రియా సరోజ్లు పెద్దలు అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.

'ఔను వాళ్లిద్దరు(రింకూ-ప్రియా సరోజ్) ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారం కోసం వేచి చూస్తున్నారు. పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.'అని తుఫానీ సరోజ్ అన్నారు.
Toofani Saroj said, "both Rinku Singh and Priya were ready, they said if guardians agreed they wanted to get married". pic.twitter.com/1tXyl8alAY
— 100rav (@Saurav6394) January 18, 2025
ఎవరీ ప్రియా సరోజ్..?
ప్రియా సరోజ్ ఇటీవలే మచ్లిషహర్ లోకసభ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 25 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డ్ సాధించారు. ఆమె ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీం కోర్టులో లాయర్గా పనిచేశారు.
ప్రియా సరోజ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ మచ్లిషహర్ నియోజకవర్గం నుంచే వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 1999, 2004, 2009లో ఆయన విజయం సాధించారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రియా సరోజ్ కొనసాగించారు. బీజేపీ సీనియర్ లీడర్ బీపీ సరోజ్పై ఆమె విజయం సాధించారు.
అయితే రాజకీయాల్లోకి కాకుండా జడ్జి కావాలనేది తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో ప్రియా సరోజ్ తెలిపారు. లా డిగ్రీ పూర్తయిన వెంటనే జడ్జికి సంబంధించిన పరీక్షల కోసం ప్రిపేర్ అయినట్లు చెప్పారు.
మరోవైపు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. అసాధారణ ప్రదర్శనతో స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున సంచలన ప్రదర్శన కనబర్చడంతో అతనికి టీమిండియాలో చోటు దక్కింది. గత రెండేళ్లుగా అతను టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తనదైన బ్యాటింగ్తో నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రింకూ సింగ్.. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.