ఇండోర్: ఆరంభంలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం.. చేజింగ్లో వరుసగా వికెట్లు కోల్పోవడం భారత్తో చివరి వన్డేలో తమ ఓటమిని శాసించిందని న్యూజిలాండ్ తాత్కలిక కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు. మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన టామ్ లాథమ్.. ప్రపంచకప్ ముందు ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్లో ఎదురైన కఠిన పరిస్థితులు ఎంత ఎక్కువగా ఎదుర్కొంటే అంత నేర్చుకోవచ్చని తెలిపాడు.
'మేం బంతితో శుభారంభం అందుకోలేకపోయాం. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అసాధారణ భాగస్వామ్యంతో చెలరేగారు. అయితే మేం అద్బుతంగా పుంజుకొని భారత్ను 380 పరుగులకే పరిమితం చేశాం. లక్ష్యచేధనలో ఓ దశలో మంచి స్థితిలో నిలిచిన మేం.. వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. ప్రపంచకప్ ముందు ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. ఈ సిరీస్తో మాకు ఓ ఐడియా వచ్చింది. మేం డెప్త్ నిర్మించాలనుకుంటున్నాం. ఈ సిరీస్ ప్రతీ ఒక్కరికి మంచి అనుభవం. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఎక్కువగా ఆడితే అంత నేర్చుకోవచ్చు'అని చెప్పాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 101), శుభ్మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్లతో 113) సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకోబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్నర్ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. డెవాన్ కాన్వే(100 బంతుల్లో12 ఫోర్లు, 8 సిక్స్లతో 138) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. హెన్రీ నికోల్స్(42) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ చెరొక వికెట్ తీసారు.