టాస్ ఓడిపోవడంతోనే భారత్తో తొలి టెస్ట్లో విజయం సాధించామని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. టాస్ ఓడిపోవడమే మంచిదైందని సంతోషం వ్యక్తం చేశాడు. భారత్తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. చివరిసారిగా 1988లో భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన టామ్ లాథమ్.. సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి ఫలితాన్ని రాబట్టామని చెప్పాడు.

'వాస్తవానికి ఈ మ్యాచ్లో మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడిపోవడమే మంచిదైంది. ఈ మ్యాచ్లో మేం సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి ఫలితాన్ని రాబట్టాం. తొలి రెండు ఇన్నింగ్స్లే మా విజయాన్ని ఖరారు చేశాయి. మూడో ఇన్నింగ్స్లో టీమిండియా కమ్బ్యాక్ చేస్తుందని మాకు తెలుసు. కానీ మా బౌలర్లు రెండో కొత్త బంతితో దెబ్బతీసారు. సొంతగడ్డపై ఇండియా ఎంత క్వాలిటీ జట్టో మాకు బాగా తెలుసు.
కొత్త బంతి మమ్మల్ని ఎలా దెబ్బతీసిందో భారత్ను కూడా అలా దెబ్బకొడుతుందని మేం అంచనా వేసాం. మా ఆటగాళ్లు అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర, టీమ్ సౌథీ భాగస్వామ్యం మా విజయానికి బాటలు వేసింది. 100 పరుగుల లక్ష్యమే ఉండటం కూడా మేం స్వేచ్చగా ఆడేలా చేసింది.
విలియమ్ ఓ రూర్కీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను పేస్, బౌన్స్తో పాటు బంతిని మూవ్ చేసి విధానం అద్భుతం. అతనికి టీమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ నుంచి బ్యాకప్ లభించింది. తొలి ఇన్నింగ్స్లో టీమ్ సౌథీ శుభారంభం అందించాడు. ఇక అతని బ్యాటింగ్ సామర్థ్యం గురించి మాకు బాగా తెలుసు. కొన్నేళ్ల క్రితమే రచిన్ టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ స్వేచ్చగా బౌండరీలు బాది మా ఒత్తిడిని తగ్గించాడు.'అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.
107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్(76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48 నాటౌట్), రచిన్ రవీంద్ర(46 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్) అద్భుత బ్యాటింగ్తో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 462 పరుగులు చేసింది. మూడు టెస్ట్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.