టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహనం కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదానికి అవాక్కైన అతను వాగ్వాదానికి దిగాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) 2025 సీజన్లో దుండిగల్ డ్రాగన్స్కు సారథ్యం వహిస్తున్న అశ్విన్.. ఫీల్డ్ అంపైర్ తప్పిదం కారణంగా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సాయి కిషోర్ వేసిన ఐదో ఓవర్లో ఆఖరి బంతిని అశ్విన్ డౌన్ ది లెగ్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే బంతిని అంచనా వేయడంలో అశ్విన్ విఫలమవ్వడంతో ప్యాడ్లను తాకింది. సాయి కిషోర్ గట్టిగా అప్పీల్ చేయగా.. మహిళా అంపైర్ ఔటిచ్చింది. ఈ నిర్ణయంతో అశ్విన్ షాకయ్యాడు. బంతి ఔట్సైడ్ లెగ్ పిచ్ అయ్యిందని అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. కానీ అంపైర్ పట్టించుకోలేదు. తొలి ఓవర్లోనే దుండిగల్ డ్రాగన్స్ బ్యాటర్లు వైడ్స్ కోసం రెండు రివ్యూలను వృథా చేశారు. దాంతో అశ్విన్కు అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం లేకుండా పోయింది. తాను ఎంత వాదించినా.. అంపైర్ వినిపించుకోకపోవడంతో అసహనానికి గురైన అశ్విన్.. బ్యాట్ను తన ప్యాడ్లపై బలంగా కొట్టుకొని పెవిలియన్ చేరాడు.

టీవీ రిప్లేలో బంతి ఔట్ సైడ్ లెగ్ పిచ్ అయినట్లు స్పష్టమైంది. ఈ ఘటనతో అంపైర్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. టీఎన్పీఎల్లో అంపైర్ల పనితీరు బాలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్లో శివమ్ సింగ్తో కలిసి ఓపెనింగ్ చేసిన అశ్విన్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 18) అంపైర్ తప్పిదం కారణంగా పెవిలియన్ చేరాడు. శివమ్ సింగ్(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30)ను కూడా సాయి కిషోర్ ఔట్ చేయడంతో దిండిగల్ డ్రాగన్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక్కరు కూడా రాణించకపోవడంతో దుండిగల్ డ్రాగన్స్ 16.2 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. సాయి కిషోర్(2/10) రెండు వికెట్లు తీయగా.. ఎసాక్కిముత్తు(4/26), మథివన్నమ్(3/12) రాణించారు. అనంతరం ఐడ్రీమ్ తిరుప్పర్ 11.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. తుషార్ రహేజా(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 65)హాఫ్ సెంచరీతో రాణించాడు. బౌలింగ్లోనూ అశ్విన్ తేలిపోయాడు. రెండు ఓవర్లు వేసి 28 పరుగులిచ్చాడు. వరుణ్ చక్రవర్తీ కూడా 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.