చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) 2023 సీజన్ విజేతగా డిఫెండింగ్ ఛాంపియన్ లైకా కోవై కింగ్స్ నిలిచింది. నెల్లాయ్ రాయల్ కింగ్స్తో బుధవారం జరిగిన ఫైనల్లో 104 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో లైకా కోవై కింగ్స్ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. సురేశ్ కుమార్(33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 57), ముఖిలేష్(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 51 నాటౌట్), అతీఖ్ ఉర్ రెహ్మాన్(21 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

నెల్లాయ్ కింగ్స్ బౌలర్లలో సోను యాదవ్, సందీప్ వారియర్ రెండేసి వికెట్లు తీయగా.. మోహన్ ప్రసత్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెల్లాయ్ రాయల్ కింగ్స్ 15 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. సుభ్రమణ్యన్(4/21), షారూఖ్ ఖాన్(3/16) నెల్లాయ్ పతనాన్ని శాసించారు. ఈ ఇద్దరికి తోడుగా గౌతమ్ కన్నన్, సిద్దార్థ్, మొహమ్మద్ తలో వికెట్ తీసారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన నెల్లాయ్ కింగ్స్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కోవై కింగ్స్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి తల వంచింది. ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
నాలుగు వికెట్లతో కోవైల్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సుబ్రమణ్యన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నెల్లాయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ జీ అజితేష్కు ఆరెంజ్ క్యాప్ దక్కింది. అతను 9 మ్యాచ్ల్లో 384 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.
మధురై పాంథర్స్ టీమ్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అతను 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. విజేతగా నిలిచిన జట్టుకు రూ.50 లక్షలు, రన్నరప్కు రూ.30 లక్షల క్యాష్ ప్రైజ్ లభించనుంది.