
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహారశైలి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఔటైన తర్వాత కోహ్లీ ప్రవర్తించిన తీరును క్రికెట్ అభిమానులంతా తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే న్యూజిలాండ్ స్టార్ పేసర్ టీమ్ సౌథీ మాత్రం భారత కెప్టెన్ను వెనుకేసుకొచ్చాడు.
కోహ్లీ ఓ క్రికెట్ పిచ్చోడని, ఆటపై ఉన్న మక్కువతోనే అలా ప్రవర్తించాడని తెలిపాడు. ఈ విషయంలో కోహ్లీది ఎలాంటి తప్పులేదని, మైదానంలో అతడు ఎంతో చురుకుగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. 'క్రికెట్ అంటే కోహ్లీకి పిచ్చి. అంతేకాక అతడు మైదానంలో ఎంతో చురుకుగా ఉంటాడు. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. ఓటమిని ఏమాత్రం సహించడు'అని న్యూజిలాండ్ రేడియోతో చెప్పుకొచ్చాడు. కోహ్లీతో కలిసి సౌథీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో విలియమ్సన్ ఔటైనపుడు కోహ్లీ అతడి వైపు చూస్తూ, గట్టిగా అరిచాడు. అసభ్య పదజాలంతో అభ్యంతరకర సైగలు చేశాడు. మైదానంలో ఎంతో హుందాగా ఉండే కేన్తో కోహ్లీ అలా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ ప్రస్తావించగా.. కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సగం సగం సమాచారంతో ప్రశ్నలు వేయవద్దని చురకలంటించాడు. ఇక న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఇంజుమామ్ ఉల్ హక్ మాత్రం అండగా నిలిచారు. త్వరలో కోహ్లీ తిరిగి ఫామ్లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కివీస్ పర్యటనలో విరాట్ 11 ఇన్నింగ్స్ల్లో వరుసగా.. 45, 11, 38, 11, 51, 15, 9, 2, 19, 3, 14లతో 218 పరుగులే చేశాడు. కెరీర్లోనే అత్యంత దారుణ ప్రదర్శనతో చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.