ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ డీలో భాగంగా యూఏఈతో మంగళవారం చెన్నై వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ ఆల్రౌండ్ షో ముందు యూఏఈ తేలిపోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టీమ్ సీఫెర్ట్(89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. మహమ్మద్ వసీమ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 66 నాటౌట్), అలిషాన్ షరఫురీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(2/37) రెండు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫ్ఫీ, లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 175 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు టీమ్ సీఫెర్ట్(42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 89 నాటౌట్), ఫిన్ అలెన్(50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
తొలి వికెట్కు అజేయంగా 175 పరుగులు జోడించిన సీఫెర్ట్, ఫిన్ అలెన్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ పేరిట ఉన్న రికార్డ్ను బ్రేక్ చేశారు. ఈ ఇద్దరూ 2022 టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగిన సెమీఫైనల్లో 170 పరుగులు జోడించారు.తాజా మ్యాచ్లో 175 పరుగుల భాగస్వామ్యంతో ఈ రికార్డ్ను టీమ్ సీఫెర్ట్, అలెన్ అధిగమించారు.
ఈ విజయంతో న్యూజిలాండ్ గ్రూప్ డీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ను న్యూజిలాండ్ ఓడించిన సంగతి తెలిసిందే. తమ తదుపరి మ్యాచ్లను సౌతాఫ్రాకి, కెనడాతో న్యూజిలాండ్ ఆడనుంది.