గయానా: టీమిండియా యువ ప్లేయర్, తెలుగుతేజం తిలక్ వర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. వెస్టిండీస్తో రెండో టీ20లో 41 బంతుల్లో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ ఈ ఫీట్ సాధించాడు.
20 ఏళ్ల 271 రోజుల వయసులో తిలక్ వర్మ తొలి టీ20 హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 20 ఏళ్ల 143 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రిషభ్ పంత్ (21 ఏళ్ల 38 రోజులు), రాబిన్ ఉతప్ప (21 ఏళ్ల 307 రోజులు), సురేశ్ రైనా (22 ఏళ్ల 90 రోజులు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24), ఇషాన్ కిషన్(27), శుభ్మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్(1), సంజూ శాంసన్(7) దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 155 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 67) హాఫ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో అకీల హోస్సెన్(16 నాటౌట్), అల్జారీ జోసెఫ్(10 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసారు.
కెప్టెన్గా హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు టీమిండియా పతనాన్ని శాసించాయి. పవర్ ప్లేలో రవి బిష్ణోయ్కు బౌలింగ్ ఇవ్వడం.. చాహల్కు పూర్తి కోటా బౌలింగ్ ఇవ్వకపోవడంతో టీమిండియాను దెబ్బతీసింది. ముఖ్యంగా 18వ ఓవర్ను చాహల్కు ఇచ్చి..19వ ఓవర్ అర్ష్దీప్ సింగ్కు ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది.