హైదరాబాద్: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ దుమ్మురేపాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఈ హైదరాబాద్ స్టార్.. అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా నాకౌట్ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ బాదిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్గా చరిత్రకెక్కాడు.
అయితే హాఫ్ సెంచరీ అనంతరం తన టీషర్ట్ పైకెత్తి టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. తిలక్ వర్మ సంబరాలు ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు, సహచర ఆటగాళ్లకు వింతగా అనిపించాయి. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై తిలక్ వర్మను వివరణ కోరగా.. తన తల్లికి ఇచ్చిన మాట కోసం అలా సంబరాలు చేసుకున్నానని అతను స్పష్టం చేశాడు.

అమ్మకు మాటిచ్చా..
ఈ హాఫ్ సెంచరీ తన తల్లితో పాటు రోహిత్ శర్మ కూతురు సమైరాకు అంకితమని తెలిపాడు. 'ఈ సెలెబ్రేషన్స్ మా అమ్మ కోసం. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్ల్లో నేను ఆశించిన రీతిలో రాణించలేకపోయా. అలా విఫలమవ్వడం నాకు చాలా కష్టంగా అనిపించింది.
ఈ సారి హాఫ్ సెంచరీ చేసినా.. జట్టు విజయం కావాల్సిన పరుగులు కొట్టినా.. నా శరీరంపై ఉన్న టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకుంటానని మా అమ్మకు మాట ఇచ్చాను. అందుకే హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే మా అమ్మ టాటూ చూపిస్తూ సంబరాలు జరుపుకున్నా. మా అమ్మతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ సమైరాకు ఈ హాఫ్ సెంచరీ అంకితం.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
వరుస వైఫల్యాలతో..
ప్రస్తుతం తిలక్ వర్మ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తిలక్ వర్మ తన పక్కటెముకల భాగంలో తల్లిదండ్రుల ఫొటోలను టాటుగా వేయించుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. సంచలన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ ప్రదర్శనతో ఆసియాకప్ 2023 టోర్నీకి ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆసియా గేమ్స్లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. నేపాల్తో క్వార్టర్ ఫైనల్లో 2 పరుగులకే ఔటై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వరుస వైఫల్యాలతో తిలక్ వర్మపై విమర్శలు వచ్చాయి.
ఆటతోనే బదులు..
ఈ పరస్థితుల్లో తప్పక ఆడాల్సిన మ్యాచ్లో తిలక్ వర్మ సత్తా చాటాడు. ఫామ్ అందుకోవడంతో తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. తిలక్ వర్మ ఇలా వెరైటీగా సెలెబ్రేట్ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. కెరీర్లో ఫస్ట్ టీ20 హాఫ్ సెంచరీ బాదినప్పుడు కూడా ఇలానే ఉయ్యాల ఊపుతున్నట్లుగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ కూతురు సమైరా కోసం అలా చేశానని చెప్పాడు.
భారత్ అలవోకగా...
బంగ్లాతో మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది. సాయి కిశోర్ మూడు వికెట్లు తీయగా.. సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, షెహ్బాజ్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 9.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 97 పరగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 40 నాటౌట్) రాణించాడు.