ఆస్ట్రేలియాతో రెండో అనధికార వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది. ఆసియా కప్ ఫామ్ను కొనసాగిస్తూ తిలక్ వర్మ(122 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో) అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. తిలక్ వర్మతో పాటు రియాన్ పరాగ్ (54 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 58) రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 45.5 ఓవర్లలో 246 పరుగులకు కుప్పకూలింది.
ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్(1), అభిషేక్ శర్మ(0)తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8) తీవ్రంగా నిరాశపర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్(4/56) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. విల్ సదర్లాండ్(2/25), తన్వీర సంఘా(2/69) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం ఓవర్లను 25కి కుదించి లక్ష్యాన్ని 160 పరుగులుగా నిర్ణయించారు. మెకంజీ హార్వే(49 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 70 నాటౌట్), కూపర్ కనోలి(31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో ఆసీస్-ఏ 16.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్నందుకుంది. భారత బౌలర్లలో నిశాంత్ సింధుకు ఒక వికెట్ దక్కింది. మూడు వన్డేల అనధికార సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.
ఆసియా కప్ 2025 ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి సూపర్ ఫామ్లో ఉన్న తిలక్ వర్మ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికవ్వనున్నాడు. మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సంబంధించిన జట్లను భారత సెలెక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ నేడు(శనివారం) ప్రకటించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.