సూర్యకుమార్ యాదవ్ కోసమే తన హాఫ్ సెంచరీని విభిన్నమైన పద్దతిలో సెలెబ్రేట్ చేసుకున్నానని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
278 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఫియర్లెస్ గేమ్తో ముంబై ఇండియన్స్ను గెలిపించేంత పని చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై భారీ సిక్స్లతో విరుచుకుపడిన తిలక్ వర్మ.. 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే 'ఇది నా అడ్డా.. నేను చూస్కుంటా'అని ముంబై డగౌట్వైపు సైగలు చేశాడు.

ఈ సెలెబ్రేషన్స్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా టీమ్తో మాట్లాడిన తిలక్ వర్మ.. 'నా హాఫ్ సెంచరీ సెలెబ్రేషన్స్ సూర్యకుమార్ యాదవ్ కోసం. అతన్ని మేం చాలా మిస్సవుతున్నాం.'అని తెలిపాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మను సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. దాంతో ఆ జట్టు 31 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ఈ పరాజంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన తిలక్ వర్మ.. తాము కోరుకున్న ఫలితం ఇది కాదని పేర్కొన్నాడు. మ్యాచ్కు హాజరైన తన తల్లిదండ్రులు, కోచ్తో సెల్ఫీ తీసుకున్న ఫొటోను పంచుకున్నాడు.
'మేం కోరుకున్న ఫలితం ఇది కాదు. మేం బలంగా పుంజుకుంటాం. మా కుటుంబం, కోచ్ల సమక్షంలో ఈ మ్యాచ్ ఆడటం గొప్పగా ఉంది.'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మాత్రం తిలక్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హాఫ్ సెంచరీ అనంతరం అతను ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.