వర్షంతో పాటు తడి ఔట్ ఫీల్డ్ కారణంగానే సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలయ్యామని టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ అన్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన తిలక్ వర్మ.. వర్షం తమ విజయవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. 'పవర్ ప్లేలో మేం కాస్త ఎక్కువగా పరుగులిచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ఆతిథ్య జట్టును కట్టడి చేశాం. చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్తో బంతిపై మాకు పట్టుచిక్కలేదు. కానీ మేం అద్భుతంగా బ్యాటింగ్ చేశాం.

సౌతాఫ్రికాలో ఆడటం ఎప్పుడూ బాగానే ఉంటుంది. కాస్త సవాల్ కూడా ఎదురవుతోంది. ఈ పరిస్థితులకు తగ్గట్లు మేం బాగా సన్నదమయ్యాం. కఠిన పరిస్థితుల్లోనూ మేం అద్భుతంగా బ్యాటింగ్ చేశాం. ఈ రోజు ఓపెనర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. కానీ ఆ తర్వాత సూర్య, నేను, రింకూ సింగ్ మంచి రిథమ్తో బ్యాటింగ్ చేసి పోరాడే లక్ష్యాన్ని అందుకున్నాం. కానీ వర్షంతో పాటు చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్ మా విజయవకాశాలను దెబ్బతీసింది.
మేం బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నట్లు నాకు అనిపించింది. ముఖ్యంగా కొత్త బంతి బాగా సీమ్ అయ్యింది. ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించింది. దాంతో ఎయిడెన్ మార్క్రమ్, టబ్రైజ్ షంసీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మేం 20 పరుగులు తక్కువ చేశాం. లేకుంటే సునాయసంగా 200 పరుగుల మార్క్ను ధాటేవాళ్లం.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 56), రింకూ సింగ్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
తిలక్ వర్మ ( 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 29), రవీంద్ర జడేజా(14 బంతుల్లో ఫోర్, సిక్స్తో 19) మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, విలియమ్స్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.
వర్షం కారణంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు. సౌతాఫ్రికా 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. రీజా హెండ్రీక్స్(27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 49), ఎయిడెన్ మార్క్రమ్(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30) ధాటిగా ఆడి విజయానికి బాటలు వేసారు.
చివర్లో ట్రిస్టాన్ స్టబ్స్(12 బంతుల్లో 2 ఫోర్లతో 14 బ్యాటింగ్), ఆండిలే పెహ్లుక్వాయో(4 బంతుల్లో సిక్స్తో 10 నాటౌట్) మెరుపులు మెరిపించి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో ముకేష్ కుమార్(2/32) రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసారు.