మా కోచ్కు చెప్పి మరీ గెలిపించాను: తిలక్ వర్మ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనుభవంతో మ్యాచ్ను ముగించానని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. మ్యాచ్లు ముగించడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన తిలక్ వర్మ.. బ్రేక్ సమయంలో తమ కోచ్కు చెప్పి మరీ మ్యాచ్ గెలిపించానన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది.
తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ సందర్భంగా మాట్లాడిన తిలక్ వర్మ.. గుడ్డిగా బ్యాట్ ఊపకుండా.. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు షాట్స్ ఆడానని తెలిపాడు.
ప్రపంచకప్ అనుభవంతో..
'నిజం చెప్పాలంటే.. నాకు మ్యాచ్లను ముంగించడం అంటే చాలా ఇష్టం. టీ20 ప్రపంచకప్తో పాటు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తర్వాత.. మ్యాచ్ను ఎలా ముగించాలనే విషయంపై నాకు ఒక అవగాహన వచ్చింది. వికెట్ ఇలా ఉంటుందని మేం అస్సలు ఊహించలేదు. బంతి స్లోగా , తక్కువ ఎత్తులో వచ్చింది. దానివల్ల షాట్లు ఆడటం కష్టమైంది. పంజాబ్ కింగ్స్ మొదటి 15 ఓవర్లలో ఎంతలా ఇబ్బంది పడ్డారో మేం చూశాం.. ఆ తర్వాత అజ్మతుల్లా, విష్ణు వినోద్ దూకుడుగా ఆడి వారికి మంచి స్కోరు అందించారు.

మా కోచ్కు మాటిచ్చి..
దాంతో నేను ఈ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాను. రెండో విరామ సమయంలో మా కోచ్తో మాట్లాడాను. నాకు కేవలం ఒక పెద్ద ఓవర్ అవసరమని, అప్పుడు నేను మ్యాచ్ను ముగించగలనని చెప్పాను. అతనికి చెప్పినట్లుగా 18వ ఓవర్లో భారీ షాట్స్ ఆడాను. విల్ జాక్స్ ఆడిన ఇన్నింగ్స్ కూడా మ్యాచ్ ముగించడానికి చాలా సహాయపడింది. నేను అతనికి ఒకటే చెప్పాను.
షాట్ ఆడేటప్పుడు షేప్ కోల్పోవద్దు. నిలకడగా ఉండు. కేవలం స్లోయర్ బంతుల కోసం వేచి చూడమని చెప్పాను. ఇక్కడ ఎత్తు వల్ల బంతి గాలిలో వేగంగా ప్రయాణిస్తుంది. కాబట్టి గుడ్డిగా బంతిని బాదాల్సిన అవసరం లేదు. కేవలం షాట్ పొజిషన్ సరిగ్గా ఉంచుకుని, స్లోయర్ డెలివరీల పట్ల అప్రమత్తంగా ఉండమని అతనికి సూచించాను.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
ముంబైకి విజయ తిలకం
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులే చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 38) దూకుడుగా ఆడాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలుపొందింది . తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

