ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్పై టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. తీవ్ర ఒత్తిడిలో కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ బరిలోకి దిగిన తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్తో చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల కవ్వింపులకు ఏకాగ్రత కోల్పోకుండా జట్టు విజయలాంఛనాన్ని పూర్తి చేసి అంతులేని ఉద్వేగంతో సింహనాదం చేశాడు. ఈ ఇన్నింగ్స్తో భారత క్రికెట్ నయా చేజ్ మాస్టర్గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న తిలక్ వర్మ.. తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్ అని తెలిపాడు. కోహ్లీతో తనను అభిమానులు పోల్చడం గౌరవంగా ఉందని తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. '2011 వన్డే ప్రపంచకప్లో టీమిండియా విజేతగా నిలవడంతో నాకు క్రికెట్పై ఆసక్తి పెరిగింది. ఆ గెలుపు స్ఫూర్తితోనే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను కోహ్లీ ఆట చూస్తూ అతన్ని చాలా విషయాల్లో అనుకరించేవాణ్ణి.

బ్యాటింగ్లోనే కాకుండా మైదానంలోనూ కోహ్లీ చూపించే దూకుడు నాపై తీవ్ర ప్రభావం చూపింది. నా ఫేవరేట్ క్రికెటర్ అయిన కోహ్లీ అభిమానులు నన్ను పోలుస్తుండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కానీ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో టీమిండియాను విజేతగా నిలబెట్టడమే నా లక్ష్యం.
ఆ దిశగానే నేను సిద్దమవుతున్నా. ప్రతీ రోజు ఈ ఆలోచనలే నన్ను మోటివేట్ చేస్తాయి. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోగలను. అప్పటి వరకు నిద్రలోకూడా ఇవే ఆలోచనలు వస్తుంటాయి. ప్రస్తుత విరామాన్ని కుటుంబ సభ్యులతో గడిపి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్కు సిద్దమవుతా.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సంజూ శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్ సాయంతో తిలక్ వర్మ విజయతీరాలకు చేర్చాడు.