ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్-ఏ జట్టు కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్-ఏ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. మరోవైపు భారత పర్యటనను ఆస్ట్రేలియా ఓటమితో ముగించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (75 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 89), లియామ్ స్కాట్(64 బంతుల్లో ఫోర్, 6 సిక్స్లతో 73), కూపర్ కన్నోల్లి(49 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా మూడేసి వికెట్లు తీయగా.. గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సింధు తలో వికెట్ పడగొట్టారు. ఆయష్ బదోని రెండు వికెట్లు తీసాడు.

అనంతరం భారత్-ఏ 46 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగులు చేసి గెలుపొందింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్(68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 102) సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(58 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 62), రియాన్ పరాగ్(55 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(22), తిలక్ వర్మ(3) తీవ్రంగా నిరాశపర్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో తన్వీర్ సంఘా, టాడ్ ముర్ఫీ నాలుగేసి వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. అనధికారిక రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్తో పాటు మూడు వన్డేల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శ్రేయస్ అయ్యర్ ఫామ్లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అక్టోబర్ 19 నుంచి టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ల కోసం భారత్ అక్కడికి వెళ్లనుంది. నవంబర్ 8 వరకు కొనసాగే ఈ పర్యటనలో ముందుగా వన్డేలు.. ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన జట్లను భారత సెలెక్టర్లు ప్రకటించారు.
టీమిండియా వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్మన్ గిల్ను కెప్టెన్గా, శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించారు. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కెప్టెన్సీ కోల్పోయినా ఆటగాడిగా రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. రవీంద్ర జడేజాపై వేటు వేసిన సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. సిరాజ్ వన్డే టీమ్లోకి రీఎంట్రీ ఇవ్వగా.. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఆసియా కప్ 2025లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన తిలక్ వర్మ.. టీ20లకే పరిమితమయ్యాడు.