ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో టీమిండియా స్టార్ బ్యాటర్, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న ఆరంభ మ్యాచ్లో తిలక్ వర్మ సిల్వర్ డక్గా వెనుదిరిగాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన తిలక్ వర్మను ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దాంతో హైదరాబాద్ జట్టు బంతి వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచిన తిలక్ వర్మ ఆ జోరును రెడ్ బాల్ ఫార్మాట్లో కొనసాగించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఏతో జరిగిన వన్డే సిరీస్లో సత్తా చాటినా.. రంజీల్లో మాత్రం శుభారంభం అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు తిలక్ వర్మ ఆడే ఏకైక రంజీ మ్యాచ్లో విఫలమవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

క్రీజులోకి వచ్చిన కొడిమెల హిమతేజ(7 బ్యాటింగ్)తో కలిసి ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(120 బంతుల్లో 13 ఫోర్లతో 90 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మూడో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 50 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఆయుష్ బదోని(3/32) మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 4 వికెట్లకు 529 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. ఆయుష్ దోసేజ(209 నాటౌట్), సనత్ సంగ్వాన్(211 నాటౌట్) అజేయ ద్విశతకాలతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. పున్నయ్య ఓ వికెట్ పడగొట్టాడు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.