గయానా: వెస్టిండీస్ గడ్డపై దుమ్మురేపుతున్న తెలుగు తేజం, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆటతోనే కాకుండా తన చర్యలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన తిలక్ వర్మ.. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అయితే ఈ హాఫ్ సెంచరీని తన బాస్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దుల కూతురు సమైరాకు అంకితమిచ్చినట్లు తెలిపాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఆమె కోసమే సంబరాలు చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్పై మాట్లాడిన తిలక్ వర్మ.. తన హాఫ్ సెంచరీని సమైరాకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. రోహిత్ శర్మ కుటుంబంతో తనకు ఉన్న బంధాన్ని పంచుకున్నాడు.

'ఈ హాఫ్ సెంచరీ రోహిత్ భాయ్ కూతురు సామీ(సమైరా)కి అంకితం. సామీకి నేను చాలా క్లోజ్. నేనెప్పుడు సెంచరీ, హాఫ్ సెంచరీ చేసినా ఆమె కోసమే సంబరాలు చేసుకుంటానని హామీ ఇచ్చాను. చెప్పినట్లుగానే సామీ కోసం సంబరాలు చేసుకున్నాను.'అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకోగా.. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
తన సక్సెస్కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కారణమని తిలక్ వర్మ తెలిపాడు. అరంగేట్ర మ్యాచ్కు ముందు ద్రవిడ్ తనతో ప్రత్యేకంగా మాట్లాడరని, ఒత్తిడి లేకుండా ఆడేలా చేశాడని చెప్పాడు. హార్దిక్ పాండ్యా సైతం స్వేచ్చగా ఆడాలని సూచించాడని పేర్కొన్నాడు. 'నేను అండర్-19 వరల్డ్ కప్ ఆడే రోజుల నుంచి రాహుల్ ద్రవిడ్తో కలిసి పని చేస్తున్నా.
బేసిక్స్ ఫాలో అవుతూ.. ఎక్కువ సేపు వికెట్పై ఉండాలని ద్రవిడ్ సర్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. హార్దిక్ భాయ్ కూడా నాకు అదే చెప్పాడు. దేశవాళీలు, ఐపీఎల్లో నువ్వు బాగా ఆడావు.. అదే బేసిక్స్ ఫాలో అవుతూ గేమ్ ఎంజాయ్ చెయ్ అని హార్దిక్ సూచించాడు' అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్తో అరంగేట్ర మ్యాచ్లో భారత ప్రధాన బ్యాటర్లంతా విఫలమైన వేళ తిలక్ వర్మ 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించాడు. పరుగులు చేయాడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్పై 51 పరుగులతో సత్తా చాటాడు. దురదృష్టవశాత్తు ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఓటమిపాలైంది.
తొలి మ్యాచ్లో 4 పరుగులతో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఖంగుతిన్నది. దాంతో ఐదు టీ20ల సిరీస్లో వెస్టిండీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 మంగళవారం రాత్రి జరగనుంది.