న్యూఢిల్లీ: ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కడంపై టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా తరఫున వన్డేలు ఆడటం తన కలని, అది నిజమయ్యే క్షణం ఆసన్నమైందని తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే ఇది సాధ్యమైందని చెప్పాడు.
ఆసియాకప్ 2023 టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో తిలక్ వర్మతో పాటు గాయాలతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నారు.

సంజూ శాంసన్ను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేయగా.. బుమ్రా, ప్రసిధ్ కృష్ణ రీఎంట్రీ ఇచ్చారు. తన ఎంపికపై స్పందించిన తిలక్ వర్మ.. రోహిత్ శర్మ అండగా నిలవడంతోనే ఇది సాధ్యమైందని చెప్పాడు.
'వన్డే క్రికెట్ ఆడటంపై నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే నేను చాలా వన్డే క్రికెట్ ఆడాను. దేశవాళీలో లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అనుభవం నాకుంది. దాంతోనే వన్డేల్లో రాణించగలనని చెబుతున్నా. జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎదురు చూస్తున్నాను.
రోహిత్ భయ్యా నాకు ఎంతో అండగా నిలిచాడు. ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి నాకు మద్దతు ఇచ్చాడు. నాకు దగ్గరగా ఉంటూ.. నాకు ధైర్యం చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభంలో నేను కాస్త కంగారుపడుతుంటే రోహిత్ భయ్యనే నా దగ్గరకు వచ్చి ఆటను ఆస్వాదించాలని చెప్పాడు. స్వేచ్చగా ఆడాలని సూచించాడు. ఎప్పుడైనా తనతో మాట్లాడవచ్చని, నీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

ఐపీఎల్లో నేను ఏంటో చూపించాను. అదే జోరును అంతర్జాతీయ క్రికెట్లో చూపించాలనుకుంటున్నా. నేను తరుచూ రోహిత్ భయ్యాతో మాట్లాడుతూనే ఉంటాను. ప్రతీసారి అతను చెప్పేది ఒక్కటే.. నీ ఆటను నువ్వు ఆస్వాదించు. ఆ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదిస్తున్నానంటే అది రోహిత్ భయ్య వల్లనే.
వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం నాకల. ఆసియాకప్ ఎంపికవ్వడం అంటే నా కల నెరవేరినట్లే. ఆసియాకప్లో భారత్ తరఫున బరిలోకి దిగడం నాకు గొప్ప విషయం.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.