సెయింట్ జాన్స్: వెస్టిండీస్ క్రికెటర్లు డారెన్ బ్రేవో, షిమ్రోన్ హెట్మైర్, కీమో పాల్.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లలేమన్నారు. అయితే స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) తెలిపింది.
ఇక వచ్చే నెలలో ఇంగ్లండ్ వేదికగా వెస్టిండీస్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కోసం ఈ ముగ్గురి పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా 14 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) బుధవారం ప్రకటించింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఎన్క్రుమా బోనెర్, పేస్ బౌలర్ చెమర్ హోల్డర్ తొలిసారి విండీస్ టెస్టు జట్టులోకి వచ్చారు. బయో-సెక్యూర్ పరిస్థితుల నడుమ నిర్వహించే ఈ సిరీస్ కోసం ఎంపికైన ఆటగాళ్లందరికీ కోవిడ్-19 టెస్టులు చేస్తారు.
అనంతరం జూన్ 8న చార్టెర్డ్ ఫ్లయిట్లో విండీస్ క్రికెటర్లు ఇంగ్లండ్కు బయలుదేరుతారు. ముందు జాగ్రత్తగా రిజర్వు ప్లేయర్లు టీమ్తోపాటు ఇంగ్లండ్ వెళ్లనున్నారు. తొలి టెస్టును హాంప్షైర్లో జూలై 8 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. అనంతరం రెండో టెస్టు జూలై 16 నుంచి 20 వరకు... మూడో టెస్టు జూలై 24 నుంచి 28 వరకు ఓల్డ్ట్రాఫర్డ్లో జరుగుతాయి.
వెస్టిండీస్ టెస్టు జట్టు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్వైట్, షై హోప్, డౌరిచ్, రోస్టన్ చేజ్, షెమారా బ్రూక్స్, రఖీమ్ కార్న్వాల్, ఎన్క్రుమా బోనెర్, అల్జారి జోసెఫ్, చెమర్ హోల్డర్, జాన్ క్యాంప్బెల్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జెర్మయిన్ బ్లాక్వుడ్.
అందుకే సోషల్ మీడియాకు ధోనీ దూరంగా ఉన్నాడు: సాక్షి