మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మహిళా సెలెక్షన్ కమిటీ మంగళవారం వెల్లడించింది. ఈ జట్టుకు నిక్కీ ప్రసాద్ సారథ్యం వహించనుండగా.. సానికా చల్కే డిప్యూటీగా వ్యవహరించనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు ఈ జట్టులో చోటు దక్కింది.
హైదరాబాద్కు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖపట్టణానికి చెందిన షబ్నమ్ అండర్ 19 ప్రపంచకప్కు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన మహిళల అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో ఈ ముగ్గురు మెరుగైన ప్రదర్శన చేశారు.

గొంగడి త్రిష హాఫ్ సెంచరీతో చెలరేగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకుంది. అండర్ 19 ప్రపంచకప్ జట్టులోకి ఇద్దరు వికెట్ కీపర్లను తీసుకున్నారు. మరో ముగ్గురు ప్లేయర్లను స్టాండ్ బైగా ఎంపిక చేశారు.
మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 16 జట్లు బరిలోకి దిగగా.. నాలుగు గ్రూప్లు విభజించారు. ప్రతీ గ్రూప్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-6కు క్వాలిఫై అవుతాయి. సూపర్ సిక్స్లో రెండు గ్రూప్ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి.
గ్రూప్-ఏలో మలేసియా, శ్రీలంక, వెస్టండీస్తో ఉన్న భారత్ ఉంది. జనవరి 19న వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఆడనుంది. 21న మలేసియా రెండో మ్యాచ్, జనవరి 23 శ్రీలంకతో మూడో మ్యాచ్లో తలపడనుంది. అండర్ 19 స్థాయిలో ఇది రెండో మహిళా టీ20 ప్రపంచకప్ కాగా.. 2023లో జరిగిన అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచింది.
భారత జట్టు: నిక్కీ ప్రసాద్(కెప్టెన్), సానికా చల్కే(వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, కమిలిని జి(వికెట్ కీపర్), భవికా అహిరె(వికెట్ కీపర్), ఈశ్వరి అవసరె, మిథిలా వినోద్, జోషితా వీజే, సోనమ్ యాదవ్, పర్ణికా సిసోదియా, కేసరి ధృతి. ఆయుషి, శుక్లా, అనందితా కిశోర్, షబ్నమ్, వైష్ణవి.
స్టాండ్ బై ప్లేయర్లు:
నందన, ఐరా, అనధి