
జోహెన్నెస్బర్గ్: ఇంగ్లండ్ పర్యటనకు ముందు సౌతాఫ్రికా మహిళల క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఈ టూర్ కోసం ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్ ముందు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో ముగ్గురికి కరోనా సోకినట్టు తేలింది. ఇద్దరు క్రికెటర్లతో పాటు ఒక సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్న క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ).. వారిని క్యాంప్ నుంచి పంపేసినట్లు స్పష్టం చేసింది.
ఆ ముగ్గురు పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉంటారని, ఇప్పుడైతే తేలిక పాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. అలాగే వారిని నిరంతరం తమ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని చెప్పింది. నెగటివ్ వచ్చిన మిగతా ప్లేయర్లు ప్రెటోరియాలో సోమవారం మొదలయ్యే క్యాంప్లో పాల్గొంటారని పేర్కొంది.
సెప్టెంబర్లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్ఏ మొత్తం 34 మంది ప్లేయర్లు, సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. అలాగే ఆగస్టు 16 నుంచి జరగబోయే రెండో దఫా శిక్షణా శిబిరానికి మరోసారి అందరికి పరీక్షలు జరపనున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది.
ఇదిలా ఉండగా, లాక్డౌన్కు ముందు ఫిబ్రవరి, మార్చిలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఈ సౌతాఫ్రికా జట్టు సెమీస్ వరకూ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 134/5 స్కోర్ చేసింది. అనంతరం వర్షం కురవడంతో డక్వర్త్లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98గా సవరించారు. దీంతో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేసి ఓటమిపాలైంది.