ఆసియా కప్ 2025 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాల్సిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ కూడా భారత సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. అయ్యర్ను సెలెక్ట్ చేయకపోవడానికి మించిన పిచ్చి నిర్ణయం లేదన్నాడు. కెప్టెన్ లాంటి ప్లేయర్ను పక్కన పెట్టడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. యూఏఈ వేదికగానే జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఐపీఎల్ 2025 సీజన్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. అలాంటి ఆటగాడికి టీ20 ఫార్మాట్లో అవకాశం లేదని సెలెక్టర్లు పక్కన పెట్టారు.

తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్రాడ్ హడిన్ భారత సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. 'శ్రేయస్ అయ్యర్ను ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు. అతను మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్. అతనికి అసాధారణమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఒత్తిడిలోనూ నిలకడగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. అతని బ్యాటింగ్ స్టైల్ వేరు. మిడిలార్డర్లో అతనికి మించిన ఆటగాడు మరొకరు లేరు. తొలుత అతని పేరు సెలెక్షన్ జాబితాలో లేకపోవడం చూసి గాయపడ్డాడని అనుకున్నా. కానీ అతడిని కావాలనే తప్పించారని తర్వాత తెలిసింది. నిజంగా ఇదొక వింత నిర్ణయం. ఎందుకంటే అయ్యర్ ఒక టీమ్ మ్యాన్. నిజానికి అతనే కెప్టెన్ అవుతాడనుకున్నా. అలాంటి ఆటగాడికి జట్టులోనే చోటే దక్కలేదు.'అని బ్రాడ్ హడిన్ చెప్పుకొచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ భారత తరఫున చివరి టీ20ని డిసెంబర్ 2023లో ఆడాడు. దేశవాళీ క్రికెట్ను విస్మరించాడనే కారణంగా 2024-25 సీజన్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి భారత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి బీసీసీఐ కాంట్రాక్ట్ అందుకున్నాడు.