
హైదరాబాద్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు ఒకరంటే ఒకరు పడదని క్రికెట్పై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా 2014 పర్యటనలో ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. కవ్వింపులకు దిగిన జాన్సన్కు విరాట్ బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఆ సిరీస్ అనంతరం కూడా చాలా సార్లు ఇద్దరు మైదానంలో తలపడ్డారు.
కోహ్లీ అంటేనే ఏమాత్రం సహించని జాన్సన్, అతని సోదరుడు స్టార్క్.. ఎప్పుడూ కవ్వింపులకు దిగుతూ అతని సహనాన్ని పరీక్షిస్తుంటారు. గెలికి మరీ మూల్యం చెల్లించుకుంటారు. అయితే న్యూజిలాండ్ గడ్డపై పూర్తిగా తేలిపోయిన కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అతని ఆటతీరు.. మైదానంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన జాన్సన్ కోహ్లీని ఎగతాళి చేశాడు. న్యూజిలాండ్తో రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో మ్యాచ్ ముగుస్తుందనగా.. భారత్కు వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని కోహ్లీ సహచర ఆటగాళ్లతో అంటూ ప్రత్యర్థులను హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు తనకు నవ్వును తెప్పించాయని జాన్సన్ కామెంట్ చేశాడు. కోహ్లీ చేసిన( 'భారత్కు వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా')వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ఈ మాటలు వింటే నవ్వొస్తొందని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. జాన్సన్పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. భారత్కు వచ్చినప్పుడు కోహ్లీ తానేంటో నీకు చూపిస్తాడులే అంటూ కామెంట్ చేస్తున్నారు.