ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు భారీ విజయం నమోదు చేసింది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది. బ్యాటింగ్లో టీమ్ డేవిడ్.. బౌలింగ్లో జాకోబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా సత్తా చాటారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ డేవిడ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్లతో 70 నాటౌట్), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రజత్ పటీదార్(19 బంతుల్లో ఫోర్, 6 సిక్స్లతో 48 నాటౌట్), ఫిల్ సాల్ట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46), విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 28) దూకుడుగా ఆడారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ప్రశాంత్ వీర్(29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 43) , జెమీ ఓవర్టన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 37) దూకుడుగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సుయాశ్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
ఆర్సీబీ పవర్ హిట్టర్ టీమ్ డేవిడ్ 8 సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడు. జెమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో నాలుగు సిక్స్లు, ఒక ఫోర్ బాది 30 పరుగులు పిండుకున్న డేవిడ్.. ఆఖరి ఓవర్లో 6, 4 బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. వాస్తవానికి అన్షుల్ కంబోజ్ వేసిన 18వ ఓవర్లో టీమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి అతను చేసింది 28 పరుగులే. కానీ ఆ బంతి నో బాల్ కావడంతో టీమ్ డేవిడ్ బచాయించాడు.
ఈ అవకాశంతో మరుసటి బంతినే సిక్సర్ బాదిన టీమ్ డేవిడ్..ఆ తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు. 8 భారీ సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీమ్ డేవిడ్ ఔటై ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేది. ఆర్సీబీ 220 పరుగుల్లోపే కట్టడయ్యేది. అప్పుడు సీఎస్కే లక్ష్య చేధన ఈజీ అయ్యేది.