టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్పై టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అది కూడా వన్డే తరహా బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్లో సర్ఫరాజ్ ఖాన్ దూకుడైన బ్యాటింగ్తో 60 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, సిక్స్తో విధ్వంసం సృష్టించాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన అతను మార్క్ వుడ్ స్లెడ్జింగ్తో చెలరేగిపోయాడు. బ్యాట్తోనే అతనికి తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇక 148 కిలోమీటర్ల వేగంతో అతను విసిరిన ఓ బౌన్సర్ను అదిరిపోయే అప్పర్ కట్ షాట్తో బౌండరీ బాదాడు.

ఈ షాట్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. సర్ఫరాజ్ ఖాన్ ప్రదర్శనకు ఫిదా అయిన సూర్యకుమార్ యాదవ్.. సోషల్ మీడియా వేదికగా అతని బ్యాటింగ్ను కొడియాడాడు.'పులి మంచి ఆకలి మీద ఉన్నట్లుంది'అని హిందీలో ప్రశంసించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ ఫొటోను షేర్ చేసిన సూర్య.. దానిపై టైగర్ ఫొటోతో భుకా హై(పులి ఆకలి మీద ఉన్నట్లుంది)అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. రాజ్కోట్ టెస్ట్తో అంతర్జాతీయ టెస్ట్ల్లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్.. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాంచీ టెస్ట్లో విఫలమైనా.. ధర్మశాల టెస్ట్లో తన బ్యాట్ పవర్ చూపించాడు.

ధర్మశాల టెస్ట్పై టీమిండియా పట్టుబిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 120 ఓవర్లలో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 103), శుభ్మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 110) సెంచరీలతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
క్రీజులో కుల్దీప్ యాదవ్(27 బ్యాటింగ్)తో పాటు జస్ప్రీత్ బుమ్రా(19 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/170) నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ రెండు వికెట్లు తీసాడు. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (79)మినహా అంతా విఫలమయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 255 పరుగులకు చేరింది.