ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హెచ్చరించాడు. సూపర్-8 దశలో అసలు సిసలు సవాల్ ఎదురువుతుందని తెలిపాడు. ఇప్పటి వరకు టీమిండియాకు గట్టి పోటీ ఎదురవ్వలేదని, బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుందన్నాడు. బౌలింగ్పై తక్షణ సమీక్ష చేయాలని సూచించారు.
నెదర్లాండ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించి అజేయంగా సూపర్-8కు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ 176 పరుగులు చేయడం భారత బౌలింగ్ బలహీనతను బయటపెట్టిందని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
'ఇప్పటి వరకు భారత్కు అసలైన సవాలు ఎదురవ్వలేదు. తొలి మ్యాచ్లో తడబడినా.. తర్వాత నిలకడైన ఆటతీరు కనబరిచింది. అసలైన పరీక్ష సూపర్ 8 దశలోనే ఎదురుకానుంది. నెదర్లాండ్స్తో మ్యాచ్లో భారత్ 193 పరుగులు చేసినా.. 176 పరుగులు సమర్పించుకుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు బౌలింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలి.

బౌలింగ్ విభాగం బలోపేతం చేయడంపై సమాలోచనలు చేయాలి. అభిషేక్ శర్మ, శివమ్ దూబే వంటి పార్ట్టైమ్ బౌలర్లను పెద్ద జట్లపై వాడటం ప్రమాదం. వారు ఒక ఓవర్లో 15 పరుగులు ఇస్తే మ్యాచ్ మూమెంటమ్ మారిపోతుంది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రిస్క్లు తీసుకోకూడదు.’అని వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు.
నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ ఏడుగురు బౌలర్లను ఉపయోగించింది. ప్రధాన బౌలర్లు బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి 9 ఓవర్లలో 53 పరుగులు ఇవ్వగా.. ఇతర బౌలర్లు 11 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది.
అయితే మ్యాచ్ అనంతరం ఈ వ్యవహారంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. మంచు ప్రభావం కారణంగా తమ బౌలర్లు పరుగులిచ్చుకున్నారని వెనకేసుకొచ్చాడు. సూపర్ 8 దశకు ముందు అందరికీ బౌలింగ్ ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంలో బౌలింగ్ చేయించామని వివరణ ఇచ్చాడు. సూపర్ 8 దశలో టీమిండియా తమ తొలి పోరును పటిష్టమైన సౌతాఫ్రికాతో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది.