టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఉన్న సౌకర్యం మరే ఆటగాడికి లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ ఆడుతూనే పెళ్లాన్ని కలిసే అదృష్టం బుమ్రా ఒక్కడికి మాత్రమే ఉందని చెబుతున్నారు. బుమ్రా సతీమణి సంజన గణేశన్ స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ కావడంతో ఆమెను మైదానంలోనే కలిసే అవకాశం అతనికి దక్కుతుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా నమీబియాతో మ్యాచ్ సందర్భంగా కూడా సంజనా గణేశన్, బుమ్రా కలిసి మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
'బుమ్రా భయ్యా రూటే సెపరేటు.. గ్రౌండ్లోనే సతీమణితో ముచ్చట్లు'అని ఒకరంటే.. లక్ అంటే బుమ్రాదే భయ్యా.. మ్యాచ్ జరుగుతుండగానే పెళ్లాన్ని కలవొచ్చని మరొకరు కామెంట్ చేస్తున్నారు. 'ఒకవైపు వికెట్లు.. మరోవైపు ముచ్చట్లు: బుమ్రా రేంజే వేరప్పా', 'ఫీల్డ్లో బుమ్రా యార్కర్లు.. మైక్ పట్టుకుని భార్య పలకరింపులు.. మామూలు కిక్కు కాదు ఇది', 'డ్యూటీలో ఉన్నా పెళ్లాన్ని కలిసే అదృష్టం.. బుమ్రా నువ్వు తోపు సామీ' అని ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తున్నారు. మరే భారత ఆటగాడికి కూడా బుమ్రాలా సతీమణిని కలిసే అవకాశం లేదు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా భారత ఆటగాళ్లతో వారి సతీమణులు ప్రయాణించేందుకు బీసీసీఐ నిరాకరించింది. జట్టు ప్రయోజనమే ముఖ్యమని భావించిన బీసీసీఐ.. టోర్నీ ముగిసే వరకు కుటుంబ సభ్యులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పెషల్ రిక్వెస్ చేసినా..బీసీసీఐ కనుకరించలేదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత ఆటగాళ్లను ఉద్దేశించి బీసీసీఐ 10 కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్పై ఆంక్షలు విధించడం ఒకటి. 45 రోజులకు మించిన విదేశీ పర్యటనల్లో 15 రోజుల్లో మాత్రమే కుటుంబ సభ్యులను అనుమతిస్తామని స్పష్టం చేసింది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ జరుగుతుండటంతో కుటుంబ సభ్యులకు అనుమతి లేకుండా పోయింది. స్వంత ఖర్చులతో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను తెచ్చుకోవచ్చని, కానీ వేరే హోటల్స్లో బస ఏర్పాటు చేయాలని సూచించింది. బుమ్రా సతీమణి స్పోర్ట్స్ యాంకర్ కావడంతో అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సంజనా గణేశన్తో బుమ్రాకు పరిచయమైంది. సంజనా గణేశన్ ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ కావడంతో ఐపీఎల్, ఇతర సిరీస్ల సందర్భంగా ఈ ఇద్దరూ తరుచుగా కలుస్తుండేవారు. పరిచయం కాస్త స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు చాలా రహస్యంగా ఉంచారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడా క్లూ ఇవ్వలేదు.
2021 మార్చి 15న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గోవాలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరిగింది. ఈ జంట 2023లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వీరు తమ కుమారుడికి 'అంగద్ బుమ్రా అని పేరు పెట్టారు. సంజనా గణేశన్ మోడలింగ్ నుంచి యాంకరింగ్ వైపు వచ్చింది. ఆమె 2014 మిస్ ఇండియా ఫైనలిస్ట్గా నిలిచింది.