ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓవరాక్షన్తోనే ఆఖరి టెస్ట్లో విజయం సాధించామని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ను టీమిండియా డ్రా చేసుకుంది. ఆ మ్యాచ్ చివరి రోజు ఆటలో సెంచరీల ముంగిట ఉన్న సుందర్, జడేజాలను డ్రాకు అంగీకరించాలని బెన్ స్టోక్స్ ఒత్తిడి చేశాడు. షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ పదే పదే అడిగాడు. ఇందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడంతో హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్లో శతకాలు చేస్తారా? అని హేళన చేశాడు. ఈ మ్యాచ్లో సుందర్, జడేజా సెంచరీలు పూర్తి చేసుకున్న అనంతరం టీమిండియా డ్రాకు అంగీకరించింది. అయితే బెన్ స్టోక్స్ భారత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఓవరాక్షన్ చేశాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే బెన్ స్టోక్స్ ప్రవర్తన తమను మరింత రెచ్చగొట్టిందని, ఆఖరి మ్యాచ్లో గెలవాలనే కసిని రగిల్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ' 100 శాతం ఆ హ్యాండ్ షేక్ వివాదం ఆఖరి టెస్ట్ గెలిచేలా మమ్మల్ని మోటివేట్ చేసింది. మా జట్టులో ఏ ఆటగాడిని అడిగినా ఇదే విషయం చెబుతారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో ఎవరైనా సవాళ్లను ఎదుర్కోవాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రతీరోజు మీరు ఆశించేది అదే. పరిస్థితి కఠినంగా మారినప్పుడు.. ఆ సవాల్ను అధిగమించాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి.'అని సుందర్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో ఓడిన భారత్ రెండో మ్యాచ్లో గెలిచింది. మూడో టెస్ట్లో ఓడి.. నాలుగో టెస్ట్ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 669 పరుగులు చేసి 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. భారీ లోటుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. సుందర్, జడేజా అసాధారణ శతకాలతో డ్రాతో గట్టెక్కింది. ఓవల్ వేదికగా హోరాహోరీగా సాగిన ఆఖరి టెస్ట్లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. సిరాజ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఈ విజయాన్నందుకుంది.